విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలు కల్పించే హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న విదేశీ గెస్ట్ వర్కర్లకు యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) శుభవార్త చెప్పింది.తిరస్కరణకు గురైన వీరి వీసా అప్లికేషన్లను తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.
ఈ వెసులుబాటు కారణంగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారత్, చైనా తదితర దేశాలకు చెందిన ఐటీ నిపుణులకు మరో అవకాశం దక్కినట్లైంది.అయితే, ఈ అవకాశం అక్టోబర్ 1, 2020 తర్వాత వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమేనని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
వీరు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అన్ని పరిశీలించిన తర్వాత వీసాలను జారీ చేస్తామని యూఎస్సీఐఎస్ అధికారులు వెల్లడించారు.అలాగే తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు 2021, అక్టోబర్ 1 వరకు గడువు ఇచ్చింది.
కాగా, కొద్దిరోజుల క్రితం ముందస్తు నోటీసు ఇవ్వకుండా వీసా దరఖాస్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించేందుకు వీలు కల్పించే విధాన నిర్ణయాన్ని తొలగించనున్నట్లు యూఎస్సీఐఎస్ వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ నిబంధన తొలగింపు ద్వారా లీగల్ ఇమ్మిగ్రేషన్లో ఉన్న చిక్కులు మరింత తొలగిపోతాయని ఏజెన్సీ పేర్కొంది.
మాజీ అధ్యక్షుడు ట్రంప్ 2018లో తెచ్చిన ఈ నిబంధన హెచ్1బీతో సహా ఎల్1, హెచ్2బీ, జే1, జే2, ఎఫ్, ఓ తదితర వీసా దరఖాస్తుదారులపై ప్రతికూల ప్రభావం చూపింది.తాజాగా Requests for Evidence (RFE), Notices of Intent to Deny (NOIDs) నిబంధనలను మారుస్తున్నట్లు, అలాగే కొన్ని రకాల Employment Authorisation Documents (EADs) కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది.2013లో తీసుకువచ్చిన నిబంధనలనే తిరిగి అమలు చేస్తామని, 2018లో తెచ్చిన నిబంధనలను తొలగిస్తామని వెల్లడించింది.తాజా నిర్ణయంతో అప్లికేషన్లలో తప్పులను సరిదిద్దుకునేందుకు వీసా దరఖాస్తుదారులకు వీలు కలగనుంది.2018లో ట్రంప్ తెచ్చిన నిబంధన ప్రకారం అవసరమైన పత్రాలు, రికార్డులు సమర్పించని పక్షంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వీసా దరఖాస్తులు తిరస్కరించేందుకు ఏజెన్సీకి అధికారం కల్పించబడింది.దీని ప్రభావం భారత్, చైనాలకు చెందిన పలు అమెరికన్ ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులపై పడింది.
తాజాగా బైడెన్ యంత్రాంగం నిర్ణయంతో ఇలాంటి వారికి ఊరట కలిగింది.