అందం, అభినయం పుష్కలంగా ఉన్న మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ హీరోయిన్ బీహార్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష రాయడంతో పాటు ఆ పరీక్ష పాస్ కావడం గమనార్హం.
అనుపమ నిజంగానే టీచర్ గా మారుతుందా.? సినిమాలకు దూరమై టీచర్ గా కెరీర్ ను కొనసాగిస్తుందా.? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం కాదనే చెప్పాలి.
అధికారుల తప్పిదం వల్ల ఒక యువకుని ఫోటోకు బదులుగా అనుపమ ఫోటో ప్రత్యక్షం కావడం గమనార్హం.
రిషికేష్ అనే యువకుడు బీహార్ లో కొన్ని రోజుల క్రితం టెట్ పరీక్ష రాశారు.మంగళవారం రోజున ఫలితాలు విడుదల కాగా ఒక పేపర్ లో రిషికేష్ కు 77.70 మార్కులు, మరో పేపర్ లో 95.45 మార్కులు వచ్చాయి.అయితే మార్క్ షీట్ లో అతని ఫోటోకు బదులుగా అనుపమ పరమేశ్వరన్ ఫోటో ఉంది.
కేరళకు చెందిన హీరోయిన్ అనుపమ ఫోటో తన మెమోలో ఉండటంతో ఆ యువకుడు అవాక్కవడంతో పాటు అధికారులకు వెంటనే ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేశాడు.
అయితే తన ఫిర్యాదు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ యువకుడు పేర్కొన్నాడు.రిషికేష్ మార్కుల మెమో వైరల్ కావడంతో బీహార్ రాష్ట్ర విద్యాశాఖపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్జేడీ నేతలలో ఒకరైన తేజస్వి యాదవ్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.తప్పుడు పరీక్షలు, ఫలితాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని కామెంట్లు చేశారు.బీహార్ విద్యాశాఖ ఇలాంటి తప్పిదాలు చేయడం ఇదే తొలిసారి కాదు.గతంలో కూడా బీహార్ విద్యాశాఖ ఇలాంటి తప్పిదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.