ప్రపంచ కుబేరులు అనగానే బిల్ గేట్స్, బఫెట్, అంబానీ ఇలా కొందరి పేర్లు వినిపిస్తాయి.అలాగే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా విరాళాలు అందించిన వాళ్ళు అనగానే బిల్ గేట్స్, బఫెట్, ఇలా కొందరి పేర్లు మాత్రమే వినిపిస్తాయి.
కానీ బిల్ గేట్స్, బఫెట్, హుఘేస్ వీరు మాత్రమే కాదు వీరందరికంటే విరాళాలు అందించడంలో ముందు వరసలో ఉన్న మరొక వ్యక్తి ఉన్నారని, అతడు వీరిని వెనక్కి నెట్టుకుని మరీ మొదటి స్థానం సాధించాడని, తాజాగా ఎడెల్ గేవ్ ఫౌండేషన్ తన పరిశోధనాత్మక నివేదికలో వెల్లడించింది.అంతేకాదు ఆ వ్యక్తి ఓ భారతీయుడు అంటూ భారతీయులు అందరూ గర్వపడేలా ప్రకటించింది.
ఇంతకీ ఆ భారతీయుడు ఎవరో కాదు టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెంషెట్ జీ టాటా.ప్రపంచంలోనే గడిచిన 100 ఏళ్ళలో అత్యధికంగా విరాళాలు అందించిన వ్యక్తులలో జెంషెట్ జీ టాటా ముందు వరసలో ఉన్నారు.
ఇప్పట్లో ఆయనను దాటుకుని వెళ్ళే వారు కూడా కనుచూపు మేరలో కనపడేలా లేరని కూడా సదరు నివేదిక తెలిపింది.ఎడెల్ గేవ్ ఫౌండేషన్, హరూన్ రెండు సంస్థలు స్వచ్చందంగా నిర్వహించిన ఈ పరిశోధనలో ఈ విషయం బయటపడింది.
టాటా గ్రూప్ ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పటి నుంచీ విరాళాలు అందించడం మొదలయ్యిందని 100 ఏళ్ళ కాలంలో దాదాపు 102 బిలియన్ డాలర్లు కేవలం సేవా కార్యక్రమాలకు జెంషెట్ జీ టాటా ఖర్చు చేశారని తెలిపింది.
సదరు సంస్థ చేసిన సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక విరాళాలు అందించిన వారు 50 మది ఉండగా వారిలో జెంషెట్ జీ టాటా ప్రధమ స్థానంలో ఉండటం గర్వించదగ్గ విషయమే.అయితే మొత్తం 50 మందిలో ప్రస్తుతం 13 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారట.ఇక రెండవ స్థానంలో బిల్ గేట్స్ ఉండగా మూడవ స్థానంలో వారెన్ బఫెట్ నిలిచారు.
ఇదిలాఉంటే విప్రో సంస్థ అధినేత అజీం ప్రేమ్ జీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయుడిగా నిలిచారు.