అసలు ఏపీ బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.రాజకీయంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలో తెలియని తికమక పరిస్థితిని ఎదుర్కొంటోంది.
బలమైన నేతలు, ప్రజా ఆకర్షణ కలిగిన వ్యక్తులు పార్టీలో లేకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో ఆ లోటును తీర్చుకుని రాజకీయంగా బలపడాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.ఇంత వరకూ ఈ వ్యవహారం బాగానే ఉన్నా, ఏపీ బీజేపీ కి అతి పెద్ద సమస్య సొంత పార్టీ నాయకుల నుంచే వచ్చి పడిందట.
పార్టీ అంతర్గతంగా నిర్వహించే సమావేశాలకు కేంద్ర బిజెపి నాయకులతో పాటు, ఏపీ బిజెపి నాయకులు హాజరవడం పరిపాటే.ఈ సందర్భంగా పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, అంతర్గతంగా ఉన్న లోపాలపైన చర్చ జరుగుతూ ఉంటుంది.
అలాగే భవిష్యత్తులో ఏం చేయాలి ? ఏ రాజకీయ పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి వంటి వ్యూహాల గురించి చర్చిస్తూ ఉంటారు.
ఇంకా అనేక అంశాల గురించి మొహమాటం లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు.
అయితే ఈ చర్చలకు సంబందించిన విషయాలు బయటకు లీక్ అవ్వడం, మీడియాలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కథనాలు వస్తుండడం వంటి వ్యవహారాలు పెద్ద తలనొప్పిగా మారాయట.కొద్ది రోజుల క్రితం విజయవాడలో బీజేపీ కీలక నేతల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్ హాజరయ్యారు.అలాగే జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శిగా కొత్త గా బాధ్యతలు స్వీకరించిన శివ ప్రకాష్ సింగ్ కూడా హాజరయ్యారు.
ఆయనను పరిచయం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ లో బీజేపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రజా సమస్యలు వంటి విషయాలపై సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా బిజెపి అంతర్గతంగా నిర్వహించే సమావేశాలు బయటకు లీక్ అవుతుండడంపై చర్చ జరిగిందట.ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన నాయకులకు కేంద్ర బిజెపి పెద్దలు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.అసలే పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సమయంలో, అంతర్గతంగా బీజేపీ నిర్వహించే సమావేశాలకు సంబంధించిన అన్ని వివరాలు లీక్ అయిపోతుండడంతో ఆ లీక్ వీరులు ఎవరో కనిపెట్టే పనిలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి లు నిమగ్నమయ్యారట.