అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడుని నియమించే విషయమై చాలా కాలంగా ఆ పార్టీలో హడావుడి జరుగుతోంది.
టి.పిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను ఎప్పటికప్పుడు మొదలు పెడుతున్న కాంగ్రెస్ అధిష్టానం ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది.వివిధ కారణాలు చూపిస్తూ వాయిదా వేస్తూ వస్తున్నారు.అంతకు ముందుగానే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి లతో పాటు ఏఐసిసి దూతలు తెలంగాణలో అభిప్రాయ సేకరణ చేపట్టడం, ఓ నాలుగైదు పేర్లను ఫైనల్ చేసినట్లుగా లీకులు ఇవ్వడం చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి.
ఈ లోపు తెలంగాణ అధ్యక్ష పీఠం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేయడం, అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తూ తననే ఎంపిక చేయాలని పట్టుబడుతూ ఉండడం, ఈ లోపు లోనే గ్రూపు రాజకీయాలు మరింతగా ముదిరిపోవడం ఇటువంటి వ్యవహారాలు సర్వ సాధారణం అయిపోయాయి.
ఇక పదవులు ఆశించే నేతలంతా ఢిల్లీకి క్యూ కడుతూ అధిష్టానం దగ్గర తమ పరపతిని ఉపయోగించి, తమ పేరు ఫైనల్ చేసుకునేలా ప్రయత్నాలు చేయడం ఇవన్నీ రొటీన్ గా మారిపోయాయి.
ప్రస్తుతం కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియను ఫైనల్ చేసే హడావుడి నడుస్తోంది.రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క తదితర నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు.
ఎవరి ప్రయత్నాల్లో వారు ఉంటూ, అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.టి.పిసిసి అధ్యక్షుని నియామకం ఎప్పుడో జరగాల్సి ఉన్నా, ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకుతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.
కానీ ఆ లోపులోనే పార్టీ లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయాయి.పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది అని అధిష్టానం పెద్దలకు తెలిసినా, వారు ఈ ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోకపోవడం ఇవన్నీ టి.కాంగ్రెస్ ను బలహీనం చేస్తూనే వస్తున్నాయి.
ఎప్పటికప్పుడు ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఢిల్లీలో హడావుడి చోటుచేసుకోవడం తప్పించి , ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న తెరపైకి వస్తోంది.