గతంలో బిజెపి లో యాక్టివ్ రోల్ పోషించిన తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి అలియాస్ రాములమ్మ మళ్లీ సొంత గూటికి చేరడంతో అక్కడ మరింత యాక్టివ్ నాయకురాలిగా మారాలని చూస్తున్నారు.బిజెపి కి తెలంగాణలో బలమైన నాయకులు ఉన్నా, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని విజయశాంతి కోరుకుంటున్నారు.
దీనిలో భాగంగానే తెలంగాణలో నెలకొన్న సమస్యలను ఆమె ప్రస్తావిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తూ వస్తున్నారు.ట్విట్టర్ ఖాతాలో ప్రతి సమస్య పైన విజయశాంతి స్పందిస్తున్నారు.
తాజాగా తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పై రాములమ్మ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించే విధంగా లాక్ డౌన్ ఎత్తివేశారు.దీనిపై విజయశాంతి ట్వీట్ చేశారు.” తెలంగాణ ప్రజలు అంటే శుద్ధ అమాయకులని మోసం చేయవచ్చు అనేది కెసిఆర్ గారి గట్టి విశ్వాసం.నిన్నటి వరకు కరోనా పేరిట పగలు కొన్ని గంటల పాటు రాత్రి మొత్తం లాక్ డౌన్ పెట్టి, చివరకు పాజిటివ్ రేటు తగ్గిపోయింది అంటూ, కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు ప్రకటించకుండానే ఉన్నట్టుండి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు.
అంతేనా లాక్ డౌన్ ఎత్తేసిన రోజునే జిల్లాల్లో పర్యటనలు , ప్రారంభోత్సవాలు మొదలుపెట్టారు.
తన దత్తత గ్రామం లో వేలాది మందితో సామూహిక భోజనాలకు కూడా ప్లాన్ వేశారు.ఇదంతా చూస్తుంటే కరోనా తగ్గిపోయిందని ఈ కార్యక్రమాలు పెట్టారో, లేక ఈ మొత్తం తెలంగాణలో కరోనా తగ్గిపోయిందని తప్పుడు నివేదికలు తెప్పించి లాక్ డౌన్ ఎత్తేసారో ప్రజలు ఆ మాత్రం గ్రహించలేని వెర్రి వాళ్ళు కాదు.
ఇది చాలక పేరెంట్స్ వద్దని వేడుకుంటున్న వినకుండా జూలై నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చేసి విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారు అంటూ ఎన్నో అంశాల గురించి విజయశాంతి తన ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిపించారు.అయితే దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది.
అసలు మీరు పోరాటాలు చేయాలనుకుంటే ట్విట్టర్ వదిలి బయటకు రావాలని, తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసి బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్ వంటి వారే ఇప్పుడు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారని, మీరు ఇంకా ట్విట్టర్ ద్వారా రాజకీయాలు చేయడం అంటే మీ రాజకీయ భవిష్యత్తు కు ఇబ్బందులు తెచ్చుకోవడమే అని సూచిస్తున్నారు.ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు.లోకేష్ ఏపీ ప్రభుత్వంపై ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే పోరాటం చేస్తున్నారని, అందుకే ఆయనను సొంత పార్టీ నేతలు సైతం సమర్థులైన నాయకుడిగా గుర్తించడం లేదని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా, అవి పూర్తిగా జనాల్లోకి వెళ్లడం లేదు అనే విషయం లోకేష్ ద్వారా బయట పడుతుందని, మీరు అలా కాకుండా క్షేత్రస్థాయిలో కి వచ్చి పోరాటం చేయాలని పలువురు నెటిజన్లు ఆమె కు సూచిస్తున్నారు.