ఏపీలో వైసిపి సాధించిన సీట్లను లెక్క వేసుకుంటే ఈ ప్రభుత్వానికి ఇప్పట్లో వచ్చిన ఢోకా ఏమీ లేదు.అలాగే లోక్ సభ స్థానాలు ఊహించిన దానికంటే ఎక్కువగానే వచ్చాయి.
జగన్ నిర్ణయాలు అనుకున్నవి అనుకున్నట్లుగానే అమలు అవుతున్నాయి.అయితే కొన్ని భారీ వ్యయంతో కూడుకున్న పథకాలకు నిధుల కొరత ఉంది.
ఇవన్నీ లెక్కలు వేసుకుని జగన్ కేంద్ర అధికార పార్టీ బిజెపితో సన్నిహితంగా మెలుగుతున్నారు.ఏపీకి ప్రయోజనాలు కల్పించే విషయంలో బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరించినా జగన్ మాత్రం బీజేపీ కి తగిన ప్రాధాన్యం ఇస్తూ, కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు ఇస్తూ వస్తున్నారు.
ఈ విషయంలో జగన్ అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా ఏపీలో ప్రధాన సమస్యలుగా ఏపీకి ప్రత్యేక హోదా తో పాటు, విభజన సమస్యలు పోలవరం ప్రాజెక్టు తదితర అంశాల్లో జగన్ నోరు మెదపడం లేదని, వైసిపి ప్రతిపక్షంలో ఉండగా గట్టిగానే హడావుడి చేస్తూ ఢిల్లీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించారు.
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పై ఒత్తిడి పెంచే అవకాశం ఉన్నా, ఆయన మౌనంగా ఉంటున్నారు అనే విమర్శలు మూటగట్టుకున్నారు.
ఆపద సమయంలో కేంద్రానికి జగన్ ఆపన్నహస్తం అందిస్తున్నా, ఏపీ కి ప్రయోజనం చేకూర్చే విషయంలో జగన్ విజ్ఞప్తులను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం జగన్ కు ఇబ్బందికరంగా మారింది.
ఇప్పటి కే వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ కూడా విడుదల కాలేదు.అలాగే రాష్ట్ర ఆర్థిక లోటు భర్తీ చేయలేదు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి.ఇవేమీ బిజెపి పట్టించుకోకపోయినా, జగన్ మాత్రం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ వస్తుండడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ అనవసర మొహమాటానికి వెళ్లి విమర్శల పాలవుతున్నారు అని, ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని , ఏపీ ప్రయోజనాల విషయంలో జగన్ గట్టిగానే కేంద్రాన్ని నిలదీయాలి అనే సూచనలు వస్తున్నా, ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి జగన్ కేవలం కొన్ని కొన్ని అంశాలపై మాత్రమే బీజేపీ నేతలతో చర్చించి, అసలైన, ప్రాధాన్యం ఉన్న అంశాలను వదిలిపెట్టేస్తున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.