సలహాలకు సీనియర్లు, వ్యవహారాలకు జూనియర్లు అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వంలో పరిస్థితి నెలకొంది.పార్టీ సీనియర్ నాయకులు గా పేరు పొందిన వారంతా మొదట్లో తమకు కీలకమైన పదవులు కట్టబెట్టి, అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని ఆశపడ్డారు.
అయితే జగన్ మాత్రం సరికొత్త వ్యూహం తో జూనియర్ నాయకులకు కీలక స్థానాలు కట్టబెట్టారు.మంత్రులుగానూ వారికే అవకాశం కల్పించారు.
పార్టీలో అయినా, పదవుల్లో అయిన జూనియర్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ సీనియర్లను సలహాలకు పరిమితం చేస్తూ ఉండటం పై గత కొంత కాలంగా పార్టీలో చర్చ జరుగుతోంది.జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు, సీనియర్ నాయకులకు ఎక్కువగా ఎంఎల్సి పదవులను కట్టబెడుతున్నారు.
తరచుగా టిడిపి పై విరుచుకుపడుతూ, వైసీపీ ప్రభుత్వానికి మేలు చేస్తున్న ఫైర్ బ్రాండ్ నాయకులకు జగన్ అంతగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు.
పదవుల విషయంలోనూ వారిని పక్కన పెడుతున్నారని వైసీపీలోనే టాక్ వినిపిస్తోంది.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకులు అయితేనే రిజల్ట్ బాగుంటుందనే అభిప్రాయానికి జగన్ రావడం , మరోవైపు జనసేన నుంచి పోటీ తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో, యువ నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారు.ఈ పరిణామాలపై సీనియర్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశం లేకపోవడం , వైసిపి అధికారంలో ఉండటంతో సైలెంట్ గానే వారంతా ఉండిపోతున్నారు.
తమకు ఎప్పుడో ఒకప్పుడు ప్రాధాన్యం దక్కుతుంది అన్నట్లుగానే ఆశగా ఎదురుచూస్తున్నారు.తనకు అత్యంత సన్నిహితులు, పార్టీకి వీర విధేయులు అనుకున్నవారికి ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, వివిధ నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు మాత్రం ఇచ్చేది లేదు అన్నట్లుగా సీనియర్ల అర్థమయ్యేలా జగన్ ఇప్పటి నుంచే వ్యవహారాలు చేస్తూ ఉండడంతో, 2024 నాటికి యువ నాయకులే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటారనే హడావుడి ప్రస్తుతం నడుస్తోంది.