అదేంటో గానీ ఈటల రాజేందర్ టీఆర్ ఎస్ నుంచి వైదొలిగితే చాలా మందికి కలిసొస్తోంది.మంత్రుల దగ్గరి నుంచి పదువులు లేనివారి వరకు అందరికీ మళ్లీ అధికారం వస్తోంది.
అసంతృప్త నేతలకు మళ్లీ కేసీఆర్ పదవులు కట్టబెట్టేందుకు రెడీ అవుతున్నారు.ఇందులో భాగంగా ఆయన ఫోకస్ ఇప్పుడు ఖమ్మం సీనియర్ నేతలపై పడింది.
ఇందులో మరీ ముఖ్యంగా తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.
వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా టీఆర్ ఎస్లో ఎలాంటి పదవీ లేకుండా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వీరికి మంచి పట్టున్న నేతలుగా గుర్తింపు ఉంది.అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ వ్యవహారంతో వీరంతా బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా నడుస్తోంది.
దీంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు.వారంతా పార్టీని వీడకుండా చూసేందుకు స్కెచ్ వేస్తున్నారు.
దీనికి తోడు ఇప్పుడు అవకాశం కూడా వచ్చింది.
ప్రస్తుతం తెలంగాణలో ప్రస్తుతం ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడంతో వాటికోసం ఈ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.ఇందులో నాలుగు పదవులు ఎమ్మెల్యేల కోటాలో, రెండు గవర్నర్ కోటాలో ఉన్నాయి.ఇదిలా ఉండగా ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరందుకుంది.
దీంతో వీరిద్దరూ మంత్రి పదవి కోసం కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది.తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటేనే ఎమ్మెల్సీ ఇవ్వండని ఈ ఇద్దరూ ప్రతిపాదన చేస్తున్నారంట.మరి ఖమ్మం నుంచి ఇప్పటికే ఒక మంత్రి ఉండటంతో మళ్లీ వీరికి అవకాశం ఇస్తారా లేదా అన్నది అనుమానమే.
ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకుండా కేవలం ఎమ్మెల్సీ పదవులతో సరిపెట్టుతారా అన్నది కూడా ఇప్పుడు తెరమీదకు వస్తోంది.ఏదేమైనా ఈటల రాజేందర్ ఎఫెక్ట్ టీఆర్ ఎస్ నేతలకు బాగానే కలిసి వస్తుందని చెప్పాలి.