వలస అనేది అనాదిగా వస్తున్న ప్రస్థానం.పూర్వం ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వలస వెళ్లడం సాధారణ జరిగేవి.
ప్రపంచమంతా ఒక గ్రామంగా మారుతున్న తరుణంలో వలస అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ.ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి, అంతర్యుద్ధాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రజలు వలసబాట పడుతుంటారు.21వ శతాబ్దంలో అంతర్జాతీయంగా ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్లడం మామూలే.బస్సెక్కి వెళ్లొచ్చినంత సులువుగా విదేశాలకు వెళ్లి రావడంతో పాటు విదేశాల్లో స్థిర నివాసం ఏర్పర్చుకుంటున్నారు.
అయితే విపరీతమైన పోటీ, చట్టబద్ధమైన లాంఛనాలు, భారీ వ్యయం కారణంగా కొందరు పరాయిగడ్డ మీద అడుగుపెట్టేందుకు శ్రమిస్తున్నారు.అయితే దొడ్డిదారిలో అయినా అక్కడికి వెళ్లాలని భావించి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమో లేదంటే అధికారులకు పట్టుబడటమో జరుగుతోంది.
అలా మధ్యదరా సముద్రంలో ఎన్నో లక్షలమంది శరణార్ధులు జల సమాధి కాగా లారీల్లో, బస్సుల్లో, ట్రక్కుల్లో సరిహద్దులు దాటుతూ పట్టుబడిన వారి సంఖ్య సైతం అదే స్థాయిలో వుంది.
తాజాగా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 33 మందిని అధికారులు అరెస్ట్ చేశారు.
వీరంతా ఊపిరి సైతం ఆడని ట్రక్కులో ప్రయాణిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.అధికారులు చూడటంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా 33 మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి.
ఈ నెల 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ఘటన జరిగిన రోజు రాత్రి 10 గంటలకు బిగ్ బెండ్ సెక్టార్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అటుగా వచ్చిన ఓ ట్రక్కును ఆపి సోదాలు చేశారు.ఆ సమయంలో ఏకంగా 33 మంది అక్రమ వలసదారులు బయటపడ్డారు.
హీట్, ఊపిరాడపోవడంతో దాదాపు వారంతా మరణానికి దగ్గరగా ఉన్నారు.వీరిలో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వీరిని వెంటనే ఆస్పత్రులకు తరలించినట్లు యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వెల్లడించారు.
తాము చేసిన తనిఖీలే వారి ప్రాణాలు కాపాడాయని ఓ అధికారి అన్నారు.
కాగా, 2019 అక్టోబర్ చివరలో, లండన్కు 20 మైళ్ల తూర్పున రిఫ్రిజిరేటెడ్ ట్రక్ ట్రైలర్లో 39 శవాలు బయటపడటం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.
బాధితుల్లో ఎనిమిది మంది మహిళలు, 31 మంది పురుషులు ఉన్నారు, వారిలో ఇద్దరు 15 సంవత్సరాల వయస్సు గలవారు.వీరంతా చైనా, వియత్నాం జాతీయులే.ఇంగ్లాండ్లో ఉపాధిని పొందేందుకు గాను సుదీర్ఘమైన ప్రాణాంతక యాత్ర చేసి గమ్యస్థానం చేరేలోపే మరణించారు.మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్(ఎంపీఐ) లెక్కల ప్రకారం ఏటా 25.8 కోట్ల మంది ప్రజలు తమ సొంత దేశాలను వదిలి వెళ్లిపోతున్నారు.వీరిలో దాదాపు కోటి మంది చైనా వాసులేనట.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వలసపోతున్న దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంది.ఆ దేశాన్ని వదిలిపోయే వారిలో 25 లక్షల మంది అమెరికా, 7.12లక్షల మంది కెనడా, 4.7లక్షల మంది ఆస్ట్రేలియాకు వెళుతున్నారు.అధికారిక మార్గాల్లో వలస వెళుతుంటే పాస్పోర్టులు, వీసా ఫీజులు చెల్లించాలి.కానీ, అనధికారిక మార్గంలో మానవ అక్రమ రవాణాదారుల సాయంతో వలసపోతే అంతకంటే ఎక్కువే ఖర్చవుతుంది.అక్కడ అవకాశాలను, అవసరాలను తీర్చేందుకు వీరికి బలమైన నెట్వర్క్ ఉంటుంది.అందుకు అదనపు డబ్బు సైతం వసూలు చేస్తుంటారు.