జంధ్యాల డైరెక్షన్ లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కి 1987 సంవత్సరంలో విడుదలైన ఆహా నా పెళ్లంట మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.సత్యం గారి ఇల్లు అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మీపతి పాత్రలో కోట శ్రీనివాసరావు అద్భుతంగా నటించారు.
ఈ సినిమాను చూసిన వాళ్లు ఆయన చేసిన లక్ష్మీపతి పాత్రను, లక్ష్మీపతి పాత్ర చెప్పే డైలాగులను అస్సలు మరిచిపోలేరు.
కోట శ్రీనివాసరావుతో పాటు బ్రహ్మానందం చేసిన అరగుండు పాత్ర సైతం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బ్రహ్మానందం ఈ సినిమాలో నత్తివాడిలా మాట్లాడుతూ సినిమాకు ప్లస్ అయ్యారు.అయితే ఈ సినిమాలో కోట శ్రీనివాసరావును తీసుకోవడానికి మొదట నిర్మాత రామానాయుడు అస్సలు ఒప్పుకోలేదట.లక్ష్మీపతి పాత్ర పండితేనే సినిమా హిట్ అవుతుందని లేకపోతే ఫ్లాప్ అవుతుందని రామానాయుడు భావించారట.
జంధ్యాల కోట శ్రీనివాసరావును సూచిస్తే రామానాయుడు మాత్రం రావుగోపాలరావును సూచించారు.20 రోజుల పాటు ఈ పాత్ర విషయంలో జంధ్యాల, రామానాయుడు మధ్య చర్చ జరిగింది.అయితే జంధ్యాల మాత్రం కోట శ్రీనివాసరావు కాకుండా ఎవరిని తీసుకున్నా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత రామానాయుడు కోట శ్రీనివాసరావును ఓకే చేశారు.
ఒకరోజు రామానాయుడు కోట శ్రీనివాసరావు ఎయిర్ పోర్ట్ లో కలవగా లక్ష్మీపతి పాత్ర గురించి రామానాయుడు కోట శ్రీనివాసరావుకు చెప్పడంతో పాటు తనకు, జంధ్యాలకు మధ్య జరిగిన వాదనను వినిపించారు.రామానాయుడు ఈ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారని అడగగా కోట శ్రీనివాసరావు రావుగోపాలరావును తీసుకోమని సూచించారు.అయితే రామానాయుడు మాత్రం కోట శ్రీనివాసరావుకే ఆ పాత్రను పోషించే అవకాశం ఇచ్చారు.
కోట శ్రీనివాసరావు ఆ పాత్రకు వచ్చిన మంచి పేరు వల్ల మరిన్ని అవకాశాలను పొందారు.