అదిగో ఇదిగో అంటూ హడావుడి తప్ప, ఏమాత్రం ప్రయోజనం లేదు అన్నట్లుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక.ఎప్పటికప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎంపిక ఫైనల్ అయిపోతుంది అంటూ హడావిడి జరగడం , కాంగ్రెస్ అధిష్టానం దూతలు తెలంగాణలో హడావుడి చేయడం, అభిప్రాయసేకరణ చేపట్టడం, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లడం అక్కడ హడావుడి చోటుచేసుకోవడం , ఆశావాహులు పెద్దఎత్తున ఢిల్లీకి క్యూ కట్టడం ఇలా గత కొద్ది సంవత్సరాలుగా ఈ తంతు జరుగుతూనే వస్తోంది.
కానీ పిసిసి అధ్యక్షుడి ఎంపిక పని మాత్రం అధిష్టానం పెద్దలు సీరియస్ గా తీసుకోవడం లేదు.దీంతో ఎవరికి వారు ఆ పదవులను ఆశిస్తూ మరొకరికి దక్కకుండా వారిపై విమర్శలు చేస్తూ, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ ఈ తరహా తలనొప్పి గత కొంతకాలంగా కాంగ్రెస్ లో చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు విషయమై కాంగ్రెస్ లో హడావుడి మొదలైంది.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ శుక్రవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో టిపిసిసి అధ్యక్షుడి ఎంపిక విషయమై చర్చించారు.
అలాగే ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాసన్ లతో పాటు తెలంగాణ నాయకుల తోనూ ఫోన్ లో మాట్లాడారు.ఆ తర్వాత కొంత మంది పేర్లతో ఈ జాబితాను రూపొందించి అధిష్టానం పెద్దలకు పంపించినట్లు తెలుస్తోంది.
అయితే తాను పిసిసి అధ్యక్షుడు రేసులో లేను అంటూ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించినప్పటికీ, ఆయన పేరు తో పాటు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయట.వీళ్ళల్లో ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకు రాగలరనే ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు లోతుగా చర్చించి ఒకరి పేరును ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ పదవులతో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కార్యదర్శులు ఇలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలు పదవుల భర్తీ చేపట్టే ఆలోచనలు కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.అయితే ఇదంతా ఎప్పటిలాగే హడావుడి తంతేనా లేక ఇప్పుడైనా సీరియస్ గా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేస్తారా అనేది అనుమానమే ?
.