ఏపీ సీఎం జగన్ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా బిజెపి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ఒక వైపు చూస్తే ఏపీలో భారీ భారీ ప్రాజెక్టులను జగన్ తల ఎత్తుకున్నారు.ఆర్థికంగా ఎంతో భారమైన పథకాలనే జగన్ ఏపీలో ప్రవేశపెట్టారు.
ఎక్కడ వాటికి బ్రేక్ వేయకుండా ఎందులోనూ కోత విధించకుండా నిరంతరంగా వాటిని అందించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.ఈ సమయంలోనూ జగన్ సంక్షేమ పథకాలకు కోటాను కోట్లు నిధులను విడుదల చేస్తూ, ఏపీ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇదంతా కొంత కాలమే.ముందు ముందు ఏపీ కి ఆర్థిక లోటు లేకుండా భవిష్యత్తు సజావుగా సాగాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం.
ఎన్డీఏ లో చేరవలసిందిగా బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడిని జగన్ ఎదుర్కొంటున్నారు.ఎన్డీఏ లో జగన్ చేరితే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో వైసీపీకి రెండు మంత్రి పదవులు ఇచ్చేందుకూ బీజేపీ సిద్ధంగానే ఉంది.
ఎన్డీఏ లో వైసీపీ చేరడం వల్ల జగన్ కు అనేక లాభాలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా తమను అదేపనిగా విమర్శిస్తూ నిత్యం లేఖలతో చికాకు తెప్పిస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నోటికి తాళం పడుతుంది.
వైసీపీ పై విమర్శలు చేసే సాహసం ఆయన చేయలేరు.ఏపీకి అందాల్సిన నిధుల విషయంలో ఎటువంటి లోటు ఉండదు.
అలాగే కొత్త అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుంది.అలాగే పోలవరం ప్రాజెక్టు తో పాటు మూడు రాజధానుల అంశానికి కేంద్రం మద్దతు లభిస్తుంది.
అలాగే సీబీఐ కేసుల నుంచి జగన్ కాస్త ఊరట పొందే అవకాశం కనిపిస్తోంది.
ఇంకా అనేక అంశాలలో జగన్ ప్రభుత్వం ఊరట పొందే అవకాశం ఉంది.అయితే ఎన్డీయే లో చేరడం వల్ల నష్టాలు అదే రేంజ్ లో ఉన్నాయి.ముఖ్యంగా బిజెపితో జత కదితే మైనారిటీలు వైసీపీకి దూరము అయ్యే అవకాశం ఉంది.
అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న ఈ పరిస్థితుల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ వ్యతిరేకత వైసిపి మూట కట్టుకోవాల్సి ఉంటుంది.ఎన్డీఏ లో చేరడం వల్ల లాభం ఎంతో నష్టమూ అంతే స్థాయిలో ఉండడంతో ఇప్పుడు ఈ విషయంలో ఏం చేయాలనే దానిపై జగన్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.