ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి.దాదాపు నెలకు పైగా నడిచిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ బీజేపీలోకి చేరింది.
దీంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.అయితే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే సమయంలో ఓ విషయం చెప్పారు.
తాను ఒంటరిగానే పోటీ చేస్తానని, ఆత్మగౌరవం కోసం పోరాడుతానంటూ ప్రకటించాడు.దాంతో ఆయన ఏ పార్టీలో చేరరని అంతా అనుకున్నారు.
కానీ అనూహ్యంగా బీజేపీలో చేరి షాక్ ఇచ్చారు.ఇక ఇదే విషయంపై ఇప్పుడు తెలంగాణ మావోయిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈటల రాజేందర్ వ్యవహారంపై మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు ఓ ఘాటు లేఖను విడుదల చేశారు.దీంతో ఈ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే మావోయిస్టు పార్టీ ఈ విధంగా స్పందించింది.ఈటల రాజేందర్ ఒంటరి పోరాటం చేస్తనన్నప్రకటనను తీవ్రంగా ఖండించింది.
ఆత్మగౌరవం కోసం పోరాడుతానన్న వ్యక్తి ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా బీజేపీలో చేరడంతో మావోయిస్టు పార్టీ మండిపడుతోంది.ఈటల రాజేందర్ కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తిగా గుర్తింపు ఉంది.అలాంటి వ్యక్తి ఆత్మగౌరవం కోసం కొట్లాడకుండా హిందూత్వ ఎజెండాగా పనిచేసే బీజేపీలో చేరడం ఆత్మగౌరవం ఎలా అవుతుందని ప్రశ్నించింది.ఇదంతా ఆయన స్వలాభం కోసమేనని, తెలంగాణ ప్రజలకు ఈటల రాజేందర్ ఎలాంటి లాభం చేకూర్చలేదన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్, ఈటల రాజేందర్ కలిసి ప్రజలను మోసం చేశారంటూ మండిపడింది.
వారిద్దరూ కలిసి ఏనాడూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషిచేయలేదని తెలిపింది మావోయిస్టు పార్టీ.వారిద్దరూ ఒకే గూటికి చెందిన పక్షులని, వారికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇప్పటికైనా నీచపు రాజకీయాలు మాని తెలంగాణ ప్రజలకు పనిచేయాలని సూచించింది.