దక్షిణాఫ్రికాలో విషాదం చోటు చేసుకుంది.వారం రోజుల క్రితం పెళ్లైన భారత సంతతికి చెందిన నవ దంపతులు అనుమానాస్పద స్థితిలో విగత జీవులయ్యారు.
జోహన్నెస్ బర్గ్కు చెందిన జహీర్ సరాంగ్, నబీల్హా ఖాన్ సొంత ఇంటిలోని బాత్రూంలో చనిపోయి కనిపించారు.వీరిద్దరికి రెండు వారాల క్రితమే వివాహం జరిగింది.
ఇటీవలే హనీమూన్కు కూడా వెళ్లొచ్చారు.జోహన్నెస్బర్గ్ వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్న ఈ కొత్త జంట ఆదివారం ప్రమాదానికి గురైంది.
తొలుత బాత్రూంలో భార్య కరెంట్ షాక్కు గురి కాగా.ఆమెను కాపాడే ప్రయత్నంలో జహీర్ సరాంగ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
భార్యాభర్తలిద్దరూ ఎంతకు బయటకు రాకపోవడంతో.కొత్త జంట కదా అని కుటుంబసభ్యులు అంతగా పట్టించుకోలేదు.కానీ ఎంత సమయం గడుస్తున్నా వారు బయటకు రాకపోవడంపై అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు వాష్రూం తలుపు బద్ధలుకొట్టి చూడగా.ఇద్దరు బాత్రూంలో చనిపోయి కనిపించారు.
భయాందోళనలకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు.
అనంతరం దంపతులిద్దరూ ఎలక్ట్రిక్ షాక్ వల్లే మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
జహీర్ సరాంగ్, నబీల్హా ఖాన్ బాత్రూంలోని షవర్ ట్యాప్కు విద్యుత్ ప్రసారం కావడంతోనే చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.అయితే, దంపతుల మృతికి అసలు కారణం ఏంటనేది మాత్రం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీసు అధికారి మవేలా మసండో మీడియాకు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి జోహన్నెస్ బర్గ్ నగర విద్యుత్ శాఖతో కలిసి సంయుక్తంగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు మసండో పేర్కొన్నారు.వారం క్రితం బంధువులు, స్నేహితుల రాకతో పండగ వాతావరణం నెలకొన్న ఆ ఇల్లు ఇలా రోజుల వ్యవధిలోనే కొత్త జంట మరణంతో స్మశానాన్ని తలపిస్తోంది.
ఇద్దరి మృతితో ఇరువుర కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.