త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది అనే వార్తలు కొద్ది రోజులుగా ఎక్కువయ్యాయి.వివిధ రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న కేంద్ర అధికార పార్టీ బిజెపి, మంత్రివర్గ విస్తరణ ద్వారా బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలనే ఆలోచనలో ఉంది.
ఈ సమాచారంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న బిజెపి ఎంపీలతో పాటు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే పార్టీలు, సన్నిహితంగా మెలుగుతున్న వారు, రాబోయే రోజుల్లో బీజేపీకి అన్ని విధాలుగా సహకారం అందించే వారు, ఇలా ఎంతోమంది తమకు మంత్రి పదవులు వస్తాయని ఆశగా ఎదురు చూపులు చూస్తున్నారు.ఈ మేరకు బిజెపి పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు.
మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా , ఏపీలో మాత్రం మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య కు కొదవే లేదు.టీడీపీ నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వంటి వారితో పాటు, పవన్ కళ్యాణ్ పేరు ప్రచారం జరుగుతోంది.
ఆయనకు మంత్రి పదవి అప్పగించడం ద్వారా సులువుగా ఏపీలో పాగా వేయొచ్చు అనేది బిజెపి ప్లాన్ గా అర్థమవుతోంది.అందుకే పవన్ కు రాజ్యసభ సభ్యత్వం తో పాటు, కేంద్ర మంత్రి పదవి అప్పగించాలనే ఆలోచనలో బిజెపి పెద్దలు ఉన్నారనే సమాచారం జనసేన లో ఆశలు పెంచుతోంది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు ఇప్పుడు ప్రచారం లోకి వచ్చింది.
బిజెపి తో సన్నిహితంగా మెలుగుతున్న జగన్ పార్టీ మొదట్లో ఎన్డిఏ లో చేరవలసిందిగా బీజేపీ నుంచి ఒత్తిడి వచ్చినా, జగన్ మాత్రం ఎన్డీఏ లో చేరేందుకు ఇష్టపడలేదు.అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవి తీసుకుంటేనే రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే లెక్కలు వేసుకుంటున్న జగన్ విజయసాయిరెడ్డి ని కేంద్ర మంత్రి చేయాలి అనే ఆలోచనల్లో ఉన్నారట. ఇక బిజెపి నేతలు జీవీయల్ నరసింహారావు, దగ్గుపాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అరడజనుకు పైగా నేతలు మంత్రి పదవి రేసులో ఉన్నారట.
అయితే బీజేపీ మాత్రం పవన్ పేరునే పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.