ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు, రామాయణం అలాగే మహాభారతం వంటి ఇతిహాస గ్రంథాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేస్తూ ఎన్నో మంచి విషయాలను గురించి తెలియజేసే ప్రముఖ ప్రవచన కర్త మరియు అవధాని గరికపాటి నరసింహా రావు గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఎలాంటి విషయాన్నైనా సుత్తి లేకుండా సూటిగా చెబుతూ మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేయడంలో గరికపాటి నరసింహారావు మంచి దిట్ట. అయితే ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న పౌరాణిక చిత్రాల విషయంపై గరికపాటి నరసింహా రావు స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా ఈ మధ్య కొందరు రామాయణం, మహా భారతం లాంటి ఇతిహాసాలపై సరైన అవగాహన లేకపోవడంతో చెడ్డవాళ్ళను మంచి వాళ్ళుగా అలాగే మంచి వాళ్ళను చెడ్డవాళ్ళుగా చిత్రీకరిస్తున్నారని ఇది సరికాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇందుకు ఉదాహరణగా మహా భారతంలోని దుర్యోధనుడు గురించి తెలియజేస్తూ దుర్యోధనుడు మహా పిరికివాడని అతడికి నాయకత్వం వహించే లక్షణాలు లేవని అలాగే ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు, వంటివారికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కానీ దుర్యోధనుడు ఎప్పుడూ కూడా తన ఆందోళనను ఇతరులపై రుద్దుతూ ఉంటాడని ఈ విషయం గురించి తెలియని వారు కొందరు దుర్యోధనుడు చాలా గొప్పవాడని, మంచి స్నేహితుడని ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అలాగే రామాయణంలోని రాముడు, రావణాసురుడు గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.ఇందులో భాగంగా రాముడు రావణాసురుడు యుద్ధ రంగంలో ఎప్పుడూ కూడా శత్రువులలాగే పోరాడారని అంతేతప్ప వారిద్దరి మధ్య ఎటువంటి స్నేహం మరియు పరిచయం లేదని తెలిపాడు.కానీ ఈ విషయం తెలియని కొందరు రామాయణంలో యుద్ధం తుది ఘట్టం చేరుకున్న తర్వాత రాముడు, లక్ష్మణుడిని రాజ్య పరిపాలన ఈ అంశంపై విద్యాభ్యాసం చేసేందుకు రావణుడి దగ్గరికి పంపించాడని, అలాగే రాముడు యాగం చేశాడని ఈ యాగం చేసే సమయంలో రావణుడే పౌరోహిత్యం వహించాడని దాంతో రాముడు రావణుడి పాదాలకు నమస్కారం చేశాడని తప్పుగా ప్రచారాలు చేస్తున్నారని తెలిపాడు.
అంతేగాక ఈ అంశాలు రామాయణంలో ఎక్కడా లిఖించబడ లేదని కూడా స్పష్టం చేశాడు.దీంతో గరికపాటి నరసింహా రావు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.