యూఏఈ గోల్డెన్ వీసా పొందాలంటే సామాన్యమైన విషయం కాదు విదేశీయులకు ఇచ్చే ఈ వీసా కు ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉంటాయి.సహజంగా అన్ని దేశాలు తమ దేశాలకు వచ్చే విదేశీయులకు పరిమితి ప్రకారం వీసాలను అందిస్తాయి.
వాటిని ఏడాదికి ఒకసారి మరలా రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు.ఇదే అమెరికా హెచ్ -1బి వీసా మాదిరిగానే అన్ని దేశాలలో అనుమతులకు వీసాలు ఉంటాయి.
అయితే శాశ్వత నివాసం కోసం ఆయా దేశాలు పలు వీసాలు అందిస్తాయి.అలాంటిదే యూఏఈ గోల్డెన్ వీసా ఈ వీసాను యూఏఈ ఇవ్వాలంటే వారికి ప్రత్యేకమైన గుర్తింపు, నైపుణ్యత కలిగి ఉండాలి.అయితే
యూఏఈ ఎంతో గౌరవంగా భావించే ఈ వీసాను తాజాగా భారతీయ హోమియోపతి వైద్యుడికి అందజేసింది.యూఏఈ లో దాదాపు 17 ఏళ్ళుగా వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న భారత సంతతి వైద్యుడు డాక్టర్ సుబేర్ పీకే ను గుర్తించిన అక్కడి ప్రభుత్వం గోల్డెన్ వీసాతో గౌరవించింది.దాంతో యూఏఈ చరిత్రలో మొట్టమొదటి సారిగా వైద్య రంగంలో గోల్డెన్ వీసాను అందుకుంటున్న భారతీయుడిగా సుబేర్ చరిత్ర సృష్టించారు.
2003 లో హోమియోపతి వైద్యాన్ని యూఏఈ ప్రభుత్వం ప్రత్యామ్నాయ వైద్యంగా గుర్తించింది దాంతో ఆయన సేవలు విస్తృతమయ్యాయి.ఈ క్రమంలోనే వైద్యరంగంలో గోల్డెన్ వీసా ఇవ్వాలని భావించిన ప్రభుత్వం సుబేర్ ను ఈ గౌరవానికి ఎంపిక చేసింది.ఇదిలాఉంటే ప్రభుత్వం తనను గోల్డెన్ వీసాతో గౌరవించడం పట్ల సుబేర్ సంతోషం వ్యక్తం చేసారు.
హోమియోపతి వైద్యానికి ప్రభుత్వం గుర్తింపు తీసుకురావడం మంచి పరిణామమని తనను ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.