ఎప్పుడూ వైసిపిని చిక్కుల్లో పెట్టడమే తన లక్ష్యంగా పని చేస్తున్నట్లు గా వ్యవహరిస్తున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవల అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చారు.ఇక ఆ తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్ గానే ఉన్నా, వివిధ సమస్యలపై వైసీపీ అధినేత జగన్ కు నిత్యం లేఖ రాస్తూ సంచలనమే సృష్టిస్తూ వస్తున్నారు.
ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలి అనే విషయంలో వైసిపి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఈ క్రమంలోనే వైసిపి అధికారిక వెబ్సైట్ లోని తమ ఎంపీల జాబితా నుంచి రఘురామకృష్ణంరాజు పేరును తొలగించింది.
దీనిపై ఆయన తనదైన శైలిలో రఘు రామ స్పందించారు.
ఈ విషయంలో జగన్ కు లేఖ రాశారు.
దీంట్లో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు.తన పేరును పార్టీ అధికారిక వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారు ? పార్టీ నుంచి తనను బహిష్కరించారా ? లేదంటే పొరపాటున పేరును తొలగించారా ? ఎవరైనా కావాలని చేశారా ? ఈ విషయాలపై తమకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.తన పేరును మళ్లీ ఆ వెబ్ సైట్ లో 48 గంటల్లో పెట్టకపోతే, తాను కావాలనే తన పేరును తొలగించినట్లు భావిస్తానని, ఇదే విషయాన్ని పార్లమెంటు సెక్రటరీకి ఫిర్యాదు చేస్తానని, తనను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకుంటాను అంటూ రఘురామకృష్ణంరాజు హడావిడి చేస్తుండడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.
ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా వైసిపి ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.అలాగే జగన్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి బీజేపీ పెద్దల పై ఈ విషయంలో ఒత్తిడి చేస్తున్నారు.ఇప్పుడు రఘు రామ చేస్తున్నట్లుగా ఆయన పేరు మళ్లీ పార్టీ వెబ్ సైట్ లో పెడితే, అవి తమకు అవమానమని, అలాకాకుండా పేరు చేర్చకుండా ఉంటే దీనిపై రఘురామ హడావుడి చేయడంతో పాటు , స్వతంత్ర అభ్యర్థిగా నిరూపించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని, అలా అయితే ఆయన 2024 వరకు కొనసాగుతారు అని, అనర్హత వేటు పడే ఛాన్స్ ఉందని వైసిపి ఆందోళన చెందుతోంది.
ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళినా, తమకు ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతాయి అనేది వైసీపీ ఆందోళనగా కనిపిస్తోంది.