లోకేష్ పై సొంత పార్టీ నాయకుల్లో సదాభిప్రాయం లేకపోయినా, ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించినా పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం ఉన్నా, లోకేష్ మాత్రం ఎక్కడ నిరుత్సాహ పడటం లేదు.పార్టీపై ఒకవైపు పట్టు సాధిస్తూనే మరోవైపు వైసీపీ ప్రభుత్వం పై పోరాటాలు చేస్తూ వస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా ప్రస్తుతం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్న లోకేష్ ప్రజల్లో బలంగా ఉన్న అంశాలను హైలెట్ చేస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే విధంగా వ్యవహరిస్తున్నారు.తాజాగా పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలనే విషయంపై లోకేష్ ఎక్కువగా హడావుడి చేస్తున్నారు.
మామూలుగా అయితే జగన్ పరీక్షల రద్దుకు మొదట్లో సముఖంగా ఉన్నా, లోకేష్ ఇదే అంశంపై పట్టుదలకు వెళ్లడంతో జగన్ సైతం అంతే స్థాయిలో పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఇంటర్, పది పరీక్షలు రద్దు చేయగా ఏపీలో ఎందుకు చేయడం లేదు అంటూ లోకేష్ నిలదీస్తున్నారు.
అందరిని పాస్ చేస్తూ ప్రకటన చేయాల్సిందిగా పట్టుబడుతున్నారు.లోకేష్ విమర్శలకు జగన్ స్పందించడం లేదు కానీ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం దీనిపై స్పందిస్తున్నారు.టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో మంత్రి వర్సెస్ లోకేష్ అన్నట్లుగా నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.భారీగా ఫీజులు కట్టి విదేశాల్లో చదువుకునే అవకాశం పేద విద్యార్థులకు లేదు కాబట్టి, వారు మంచిగా చదువుకొని పరీక్షల్లో పాస్ అయితేనే వారి భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని లోకేష్ తెలుసుకోవాలంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ కౌంటర్ లు ఇస్తున్నారు.
కేవలం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్రాల గురించి లోకేష్ మాట్లాడుతున్నారని, రాష్ట్రాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.అయినా లోకేష్ మాత్రం ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు.పరీక్షలను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని , అవసరమైతే న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.లక్షలాది మంది విద్యార్థులు ఏపీలో ఉన్నారు కాబట్టి, వీరు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే, రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంది అనే అభిప్రాయంలో లోకేష్ ఉన్నట్టు అర్థం అవుతోంది.
విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే రాబోయే ఎన్నికల్లో అది వరంగా మారుతుందనే అంచనా లోకేష్ వేస్తున్నారు.యూత్ లో తనకు క్రేజ్ పెరుగుతుందని, యువ నాయకుడు గా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందనే నమ్మకం లోకేష్ లో బాగా కనిపిస్తోంది.