కరోనా మహమ్మారి వల్ల అష్టకష్టాలు పడిన దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, మరణాలతో యూకే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
ఆ తర్వాత వైరస్ వ్యాప్తి నెమ్మదించడంతో ఊపిరి పీల్చుకుంది.కానీ తిరిగి డిసెంబర్, జనవరి నెలల్లో సెకండ్ వేవ్ విజృంభించడంతో పాటు కొత్త రకం స్ట్రెయిన్తో బ్రిటన్ వణికిపోయింది.
కొత్త రకం కోవిడ్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని యూకే ప్రభుత్వం గుర్తించింది.నవంబరులో మూడోసారి నాలుగు వారాల లాక్డౌన్ విధించిన బ్రిటన్.
డిసెంబరు మొదటి వారంలో ఆంక్షలు సడలించింది.కానీ, పరిస్థితి అదుపుతప్పుతుందని భావించి మళ్లీ లాక్డౌన్ ప్రకటించారు.
ఇదే సమయంలో వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేసింది.దీనితో పాటు వ్యాక్సినేషన్కు పెద్ద పీట వేసింది.
దీని వల్లే కోవిడ్ వెలుగు చూసిన తర్వాత తొలిసారిగా జీరో మరణాలు నమోదయ్యాయి.స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్లలో కూడా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని ఫోర్బ్స్ పత్రిక ఇటీవల పేర్కొంది.
ఈ నేపథ్యంలో జూన్ 21 నుంచి పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేస్తామని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అయితే ఆశలపై డెల్టా వేరియంట్ ( భారత్ కరోనా రకం బి.1.617.2) నీళ్లు చల్లింది.భారత్ తర్వాత ఈ రకం వేరియంట్ కేసులు ఎక్కువగా అక్కడే నమోదయినట్టు డబ్ల్యూహెచ్ఓ నివేదిక సైతం పేర్కొంది.
ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షల సడలింపులపై బ్రిటన్ పునరాలోచనలో పడింది.భారత్లో వ్యాప్తికి కారణమైన కరోనా వేరియంట్ కేసుల పెరుగుదల బ్రిటన్లో అన్లాక్ ప్రక్రియకు తీవ్రమైన విఘాతం కలిగించవచ్చని కొద్దిరోజుల క్రితం ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం అభిప్రాయపడ్డారు.
తాజాగా ప్రభుత్వం డెల్టా వేరియెంట్కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.కరోనాలోని ఇతర వేరియంట్లు సంక్రమిస్తే ఇంట్లో ఒక్కరు మాత్రమే వైరస్ ప్రభావానికి గురయ్యేవారని, కానీ ఈ డెల్టా వేరియంట్ వల్ల ఇంట్లోని వారందరూ కరోనా బారినపడుతున్నారని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) వెల్లడించింది.కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని మ్యూటేషన్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని తమ అధ్యయనంలో తేలినట్టు వెల్లడించింది.కుటుంబాలకు కుటుంబాలే పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడడం వెనక డెల్టా వేరియంట్ కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు తెలియజేశారు.అల్ఫా వేరియంట్గా పిలిచే బి.1.1.7తో పోలిస్తే డెల్టా వేరియంట్ 64 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్.దేశంలో అన్లాక్ ప్రక్రియను 4 వారాలు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.అయితే ఆంక్షలు ఎత్తివేసిన పక్షంలో థర్డ్ వేవ్ ముంచుకురావొచ్చని గతంలోనే భారత సంతతి శాస్త్రవేత్త రవి గుప్తా యూకే ప్రభుత్వాన్ని హెచ్చరించారు.యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ శాస్త్రీయ సలహాదారుగా గుప్తా వ్యవహరిస్తున్నారు.
జూన్ 21 నుంచి అన్ని ఆంక్షలను ఎత్తివేయకుండా జాప్యం చేయాలనీ ఆయన ఆనాడే ప్రభుత్వానికి సూచించారు.మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.