భారత సంతతికి చెందిన ఇద్దరు జర్నలిస్ట్లకు అరుదైన గౌరవం దక్కింది.జర్నలిజంలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటిగా భావించే ‘‘పులిట్జర్ ప్రైజ్’’కు వీరిద్దరూ ఎంపికయ్యారు.
వీరిలో ఒకరు మేఘా రాజగోపాలన్ కాగా, మరొకరు నీల్ బేడీ.జిన్జియాంగ్ ప్రావిన్స్లో రహస్యంగా వందలాది జైళ్లు, నిర్బంధ శిబిరాలు నిర్మించి.
వేలాది మంది వుయిగర్ ముస్లింలను అదుపులోకి తీసుకుని.చైనా ప్రభుత్వం చిత్ర హింసలకు గురి చేస్తోన్న విషయాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చారు మేఘ రాజగోపాలన్.‘బజ్ఫీడ్ న్యూస్’ అనే డిజిటల్ మీడియా సంస్థలో పనిచేస్తున్న మేఘా రాజగోపాలన్ ‘‘ఇంటర్నేషనల్ రిపోర్టింగ్’’ కేటగిరీలో పులిట్జర్ పురస్కారం అందుకోనున్నారు.
మేఘా పరిశోధన ఇలా:
2017 లో, జిన్జియాంగ్లో చైనా వేలాది మంది వుయిగర్ ముస్లింలను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించింది.ఆ కొద్దికాలానికే, రంగంలోకి దిగిన రాజగోపాలన్ అక్కడి ఒక నిర్బంధ శిబిరాన్ని సందర్శించారు.తమ దేశంలో ముస్లింలను అదుపులోకి తీసుకోలేదని, వారిని చిత్రహింసలకు గురిచేయడం లేదంటూ చైనా బుకాయించిన సమయంలో, బజ్ఫీడ్ న్యూస్ సంచలన విషయాలను బహిర్గతం చేసింది.
అయితే మేఘా రాజగోపాలన్ జిన్జియాంగ్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించిన చైనా ప్రభుత్వం రంగంలోకి దిగింది.ఆమె వీసాను సస్పెండ్ చేయడమే కాక చైనా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
అయినప్పటికీ భయపడని మేఘా.మరో ఇద్దరు నిపుణుల సాయంతో లండన్ను తన కార్యక్షేత్రంగా మార్చుకున్నారు.
వీరిలో ఒకరు అలిసన్ కిల్లింగ్, లైసెన్స్ పొందిన ఆర్కిటెక్చర్, భవనాల ఉపగ్రహ చిత్రాల ఫోరెన్సిక్ విశ్లేషణలో నైపుణ్యం కలిగినవాడు.మరొకరు క్రిస్టో బుస్చెక్… డేటా జర్నలిస్టుల కోసం టూల్స్ రూపొందించే ప్రోగ్రామర్.
ఈ ముగ్గురు కలిసి చైనా సెన్సార్ చేసిన వేలాది ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి అక్కడ జరుగుతున్న అరాచకాలను బయటి ప్రపంచానికి వెల్లడించారు.ఈ క్రమంలో ఆమె సాహసానికి గుర్తింపు దక్కాలనే ఉద్దేశంతో బజ్ ఫీడ్ న్యూస్ .ఈ వివరాలతో పులిట్జర్కు దరఖాస్తు చేసింది.తాను అవార్డు గెలుచుకుంటానని తాను అస్సలు ఊహించలేదన్నారు మేఘా రాజగోపాలన్.
ఇక మరో భారత సంతతి జర్నలిస్ట్ నీల్ బేడీ విషయానికి వస్తే… ‘తంపాబే టైమ్స్’లో ఆయన పనిచేస్తున్నారు.తన సహచరి కత్లీన్ మెక్గ్రోరీతో కలిసి ఆయన లోకల్ రిపోర్టింగ్ విభాగంలో సంయుక్తంగా ఈ పురస్కారం అందుకోనున్నారు.
ఫ్లోరిడాలోని పాస్కో కౌంటీలో షెరీఫ్ ఆఫీస్ అమల్లోకి తెచ్చిన ఓ విధానాన్ని వీరు వెలుగులోకి తెచ్చారు.ఓ కంప్యూటర్ మోడలింగ్ విధానంలో కొంతమందిని భవిష్యత్తు నేరగాళ్ల పేరిట గుర్తించి వారిపై నిఘా పెట్టి పోలీసులు తీవ్రంగా వేధించారు.షెరీఫ్ కార్యాలయ దురాగతాలను అన్ని ఆధారాలతో సహా బయటపెట్టినందుకు గాను నీల్ బేడీ, కత్లీన్ మెక్గ్రోరీని పులిట్జర్ వరించింది.
అసలేంటీ పులిట్జర్:
అమెరికాలో జోసెఫ్ పులిట్జర్ అనే వార్తాపత్రిక ప్రచురణకర్త వీలునామా ద్వారా ఈ పులిట్జర్ ప్రైజ్ ప్రధానం మొదలైంది.1911 అక్టోబర్ 29న పులిట్జర్ మరణించారు.ఆయన మరణానంతరం ఈ వీలునామా వెలుగులోకి వచ్చింది.
‘కొలంబియా యూనివర్శిటీలో ఓ జర్నలిజం స్కూలును ప్రారంభించాలన్నది తన కోరిక అని… జర్నలిజంలో నిష్ణాతులైన వారికి తన పేరిట ‘పులిట్జర్ ప్రైజ్’ అవార్డులు ఇచ్చి సత్కరించాలని ఆయన కోరారు.ఇందుకు గాను తన ఆస్తి నుంచి రెండు లక్షల 50 వేల డాలర్ల రూపాయలను కేటాయిస్తున్నానని పులిట్జర్ పేర్కొన్నారు.
ఆయన కోరిక మేరకు 1917 జూన్ 4న పులిట్జర్ బహుమతులను ప్రకటించారు.నాటి నుంచి ప్రతి యేటా 21 కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు.
అవార్డును గెలుచుకున్న వారికి 15 వేల డాలర్ల రివార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తారు.సామాజిక సేవ కేటగిరీలో అవార్డులను గెలుచుకున్న వారిని మాత్రం గోల్డ్ మెడల్తో సత్కరిస్తారు
.