అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై తన మార్క్ చూపిస్తున్న జో బైడెన్.ట్రంప్ కాలం నాటి నిబంధనలను, నిర్ణయాలను ఒక్కొక్కటిగా ఎత్తేస్తూ వలసదారులకు ఊరట కలిగిస్తున్నారు.
మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసదారులకు తలుపులు తెరిచారు.ఇక హెచ్ 1 బీ వీసాలు, గ్రీన్కార్డుల జారీపై వున్న నిషేధాన్ని ఎత్తివేశారు.
దీంతో పాటు లాటరీ విధానంలోనే హెచ్ 1 బీ వీసాలు మంజూరు చేస్తామని బైడెన్ వెల్లడించారు.అలాగే గ్రీన్కార్డుల జారీపై దేశాల కోటా పరిమితి (కంట్రీ క్యాప్)ని ఎత్తేయడంతో పాటుగా దేశంలో చట్టవిరుద్ధంగా తలదాచుకుంటున్న 1.1కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించాలని భావించింది.దీనికి వీలు కల్పించే అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
,/br>
తాజాగా ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన మరో నిబంధనకు బైడెన్ యంత్రాంగం మంగళం పాడింది.ముందస్తు నోటీసు ఇవ్వకుండా వీసా దరఖాస్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించేందుకు వీలు కల్పించే విధాన నిర్ణయాన్ని తొలగించనున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది.
ఈ నిబంధన తొలగింపు ద్వారా లీగల్ ఇమ్మిగ్రేషన్లో ఉన్న చిక్కులు మరింత తొలగిపోతాయని ఏజెన్సీ పేర్కొంది.
బైడెన్-హారిస్ నేతృత్వంలో తీసుకున్న విధాన చర్యలు దేశ చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు వున్న అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడుతుందని యుఎస్సీఐఎస్ డైరెక్టర్ ట్రేసీ రెనాడ్ చెప్పారు.అలాగే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు సంబంధించి వలసదారులపై వున్న భారాన్ని తగ్గించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెనాడ్ తెలిపారు.
మాజీ అధ్యక్షుడు ట్రంప్ 2018లో తెచ్చిన ఈ నిబంధన హెచ్1బీతో సహా ఎల్1, హెచ్2బీ, జే1, జే2, ఎఫ్, ఓ తదితర వీసా దరఖాస్తుదారులపై ప్రతికూల ప్రభావం చూపింది.తాజాగా Requests for Evidence (RFE), Notices of Intent to Deny (NOIDs) నిబంధనలను మారుస్తున్నట్లు, అలాగే కొన్ని రకాల Employment Authorisation Documents (EADs) కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది.2013లో తీసుకువచ్చిన నిబంధనలనే తిరిగి అమలు చేస్తామని, 2018లో తెచ్చిన నిబంధనలను తొలగిస్తామని వెల్లడించింది.తాజా నిర్ణయంతో అప్లికేషన్లలో తప్పులను సరిదిద్దుకునేందుకు వీసా దరఖాస్తుదారులకు వీలు కలగనుంది.2018లో ట్రంప్ తెచ్చిన నిబంధన ప్రకారం అవసరమైన పత్రాలు, రికార్డులు సమర్పించని పక్షంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వీసా దరఖాస్తులు తిరస్కరించేందుకు ఏజెన్సీకి అధికారం కల్పించబడింది.దీని ప్రభావం భారత్, చైనాలకు చెందిన పలు అమెరికన్ ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులపై పడింది.తాజాగా బైడెన్ యంత్రాంగం నిర్ణయంతో ఇలాంటి వారికి ఊరట కలిగింది.