కరోనా కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.ఇంట్లో సంపాదించే ఇంటి పెద్దను కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇలాంటి వారికి 20 శాతం సబ్సీడీతో 5 లక్షల వరకు రుణం ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంది.
ఎస్సీ ఆర్ధికాభివృద్ధి సంస్థ ద్వారా వీరికి రుణం అందనుంది.అంతేకాదు అందుకున్న రుణంలో 20 శాతం రాయితీ పోను మిగతా మొత్తాన్ని 6 శాతం వడ్డీతో వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది.
ఇందుకు కొన్ని నిబంధనలు కూడా కేంద్రం విధించింది.
కరోనా మరణించిన వ్యక్తి వయసు 18 నుండి 60 ఏళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది.కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల మించి ఉండకూడదు.కుటుంబంలో తల్లిదండ్రులు మరణించినా, సంపాదించే వ్యక్తి మరణించినా ఈ ఆర్ధిక సాయం లభిస్తుంది.
కుటుంబ పెద్ద కొవిడ్ తో మరణించినట్టు ధ్రువీకరణ పత్రం చూపించాలి.కుటుంబం మొత్తం అతడి సంపాదన మీద ఆధారపడి ఉండాలి.
ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను గుర్తించి ఆ జాబితా పంపించాలని ఎన్.ఎస్.ఎఫ్.డి.సీ రాష్ట ప్రభుత్వాలను కోరింది.ఈ మేరకు శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ వారు ఆదేశాలు జారీ చేశారు.
జాబితా రెడీ చేసి బాధితులకు సాయం అందేలా చూస్తామని వారు చెప్పారు.