విద్యా, ఉద్యోగ, వ్యాపారాల కోసం భారతీయులు దశాబ్ధాల కిందటే అమెరికాకు వలస వెళ్లారు.క్రమేపీ అక్కడి సమాజంలో కలిసిపోయిన భారతీయులు బలమైన శక్తిగా ఎదిగిన సంగతి తెలిసిందే.
అన్ని రంగాల్లోనూ కీలక స్థానాల్లో వున్న ఇండో అమెరికన్లు దేశాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు.సాఫ్ట్వేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఏ రంగం తీసుకున్నా భారతీయుల ఆధిపత్యం సాగుతోంది.ప్రభుత్వ యంత్రాంగంలోనూ ఉపాధ్యక్షురాలి వంటి అత్యున్నత పదవుల్లో మనవారే ఉన్నారు.
2019 నవంబర్ నాటి అమెరికన్ కమ్యూనిటీ సర్వే లెక్కల ప్రకారం.అమెరికా జనాభా మొత్తం 327 (32 కోట్ల 70 లక్షలు) మిలియన్లు.వీరిలో విదేశీ సంతతికి చెందినవారు 13.7 శాతం అంటే 44.7 మిలియన్లు.గడిచిన కొన్నేళ్లుగా అమెరికాలో విదేశీ సంతతి జనాభా 0.4 శాతం చొప్పున పెరుగుతోంది.2010 నాటికి అగ్రరాజ్యంలో విదేశీ సంతతి జనాభా 40 మిలియన్లు కాగా.2018 నాటికి అది 11.8 శాతం పెరిగింది.జులై 1, 2018 నాటికి వీరిలో భారతీయులు 2.5 మిలియన్లు (సుమారు 25 లక్షలు).2010 నాటితో పోలిస్తే భారత సంతతి 1.5 శాతం పెరిగింది.అమెరికాలోని మొత్తం విదేశీ సంతతిలో భారతీయుల శాతం 5.9.ఇది దేశ జనాభాలో 1 శాతం.2010-2018లో భారతీయుల సంఖ్య 8.7 లక్షలకు పెరిగింది.
1990వ దశకానికి పూర్వం అమెరికాలో భారతీయ సంతతి జనాభా కేవలం 4.5 లక్షల మంది మాత్రమే.ఇది 2018 నాటికి 489 శాతం పెరగడం గమనార్హం.2018కి 2.84 మిలియన్లతో చైనీయుల జనాభా 32 శాతం పెరిగింది.1990 తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో పలు విదేశీ సంస్థలు భారత్లో అడుగుపెట్టాయి.వీటిలో అమెరికన్ కంపెనీల పాత్ర అధికంగా వుండడంతో మానవ వనరుల బదలాయింపు పెద్ద ఎత్తున మొదలైంది.90వ దశకం నుంచి నేటి వరకు అమెరికాకు భారతీయ వలసలు పెరిగాయి.ఉద్యోగాలు, ఉన్నత విద్య, వ్యాపారాల కోసం అమెరికా బాట పట్టారు.ఈ కారణం చేతలనే అమెరికాలో భారతీయ సంతతి గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఐక్యరాజ్య సమితి పాపులేషన్ డివిజన్, తాజాగా విడుదల చేసిన ‘ఇంటర్నేషనల్ మైగ్రేషన్ 2020 హైలైట్స్’ నివేదిక, 2020లో 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వలస వెళ్ళినట్లు వెల్లడించింది.భారత్ నుంచి వలస వెళ్ళిన అత్యధిక మందికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియాలు ఆశ్రయం కల్పిస్తోన్నాయి.
అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.
భారతీయులపై అమెరికాలో వివక్ష సైతం క్రమంగా పెరుగుతోంది.అక్కడ ప్రతి ఇద్దరు భారతీయ అమెరికన్లలో ఒకరు జాతి, మత వివక్షను ఎదుర్కొంటున్నట్టు ఓ సర్వే వెల్లడించింది.
కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్ హాప్కిన్స్ ఎస్ఏఐఎస్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
గతేడాది సెప్టెంబర్ 1 నుంచి 20 మధ్య ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే (ఐఏఏఎస్) పేరుతో ఆన్లైన్ చేపట్టిన ఈ అధ్యయనంలో 1,200 మంది భారతీయుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్నారు.ఈ సర్వే ఫలితాలను ‘భారతీయ అమెరికన్ల సామాజిక స్థితిగతులు’ పేరిట బుధవారం విడుదల చేశారు.భారత్ నుంచి వలస వెళ్లిన వారి కంటే అమెరికాలో పుట్టి పెరిగిన భారత సంతతి ఎక్కువ వివక్షను ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనంలో తేలింది.
ఇక, అమెరికాలోని భారతీయ సమాజంలో ప్రతి పది మంది ఎన్ఆర్ఐల్లో 8 మంది.తోటి భారతీయులనే వివాహం చేసుకుంటున్నారని తేలింది.అమెరికాలో పుట్టిన భారత సంతతి యువతి, యువకులు తమకు కాబోయే జీవిత భాగస్వామిగా భారత మూలాలున్న వ్యక్తే కావాలని కోరుకుంటున్నారట.ఇకపోతే సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు మూడొంతుల మంది తమ జీవితాల్లో మతం చాలా కీలకమైందని స్పష్టం చేశారు.
వీరిలో 40 శాతం మంది రోజుకు ఒక్కసారైనా దేవుడ్ని ప్రార్ధిస్తామని, 27 శాతం మంది వారానికి ఒకసారి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతామని చెప్పారు.ఆశ్చర్యకరంగా అమెరికాలోని హిందువుల్లో సగం మంది పేరుకు చివర కులాన్ని కచ్చితంగా తగిలించుకుంటున్నారని అధ్యయనంలో తేలింది.
తమను ఇండియన్ అమెరికన్లని పిలవడం తమకిష్టం లేదని 60 శాతం మంది చెప్పడం విశేషం.