మొత్తానికి తెలంగాణలో ఎలా బలపడాలనే విషయంపైన బీజేపీ నేతలు నిన్న జరిగిన కీలక సమావేశంలో ఒక క్లారిటీ కి వచ్చారు.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ ఛుగ్ తదితరులు ఆకస్మాత్తుగా హైదరాబాద్ కు వచ్చి మరీ కీలక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో ఏ విధంగా బల పడాలి ? ఏ నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తే బిజెపి అధికారం వైపు అడుగులు వేస్తుంది ఇలా అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈనెల 14న బీజేపీలో ఈటెల రాజేందర్ చేరబోతున్న తరుణంలో ఆయన చేరిన తర్వాత ఇక టిఆర్ఎస్ విషయంలో సానుకూల వైఖరిని విడిచిపెట్టాలని తరుణ్ ఛుగ్ పార్టీ నాయకులకు సూచించారు.
కెసిఆర్, టిఆర్ఎస్ కు తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్రంలో బిజెపి నిర్ణయాలను విధానాలను పొగుడుతూ, సఖ్యత గా ఉన్నట్లు గా వ్యవహరిస్తారని, తర్వాత మళ్లీ యధావిధిగా బీజేపీపై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటారు అని, ఇక పై ఆ అవకాశం కెసిఆర్ కు ఇవ్వకుండా టిఆర్ఎస్ విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.ప్రజలలోనూ బిజెపి టిఆర్ఎస్ వైరం మధ్య అనేక అనుమానాలు ఉన్నాయనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించారు.
అందుకే టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటన్నిటి పైన విచారణ చేయిస్తే టిఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని, ఇది బీజేపీకి బాగా కలిసి వస్తుందని ప్రజల్లో ఉన్న అపోహలు కూడా తొలగిపోతాయని బిజెపి తెలంగాణ నేతలు సూచించడంతో ఈ విషయంపై అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.
అయితే ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి వ్యవహారాలపై విచారణ చేయిస్తామని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్తారు అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సందర్భం వచ్చినప్పుడల్లా వ్యాఖ్యానిస్తున్నారు.ఇప్పుడు ఈ సమావేశంలో ను ఈ వ్యవహారంపై ప్రధానంగా చర్చించడంతో బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలకు సంబంధించి విచారణలు చేయించే అవకాశం కనిపిస్తోంది.ఏది ఏమైనా రాజేందర్ చేరిన తరువాత తెలంగాణ బిజెపి కి ఒక ఊపు అయితే ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.