ఏపీ సీఎంగా జగన్ ఏం చేసినా అది పెద్ద సంచలనమే.జగన్ పరిపాలన ఒక సరికొత్త రికార్డు అన్నట్లుగా వైసిపి నాయకులు పదేపదే చెబుతూ ఉంటారు.
దానికి తగ్గట్లుగానే జగన్ వ్యవహార శైలి ఉంటుంది .దేశవ్యాప్తంగా ది బెస్ట్ సీఎం అనిపించుకోవాలని జగన్ ఆకాంక్ష.దానికి తగ్గట్లుగానే ఆయన వ్యవహారాలు చేస్తూ ఉంటారు.అయితే జగన్ కు ఆ స్థాయిలో క్రెడిట్ రాకుండా కొన్ని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా వచ్చిన ఈ క్రెడిట్ మొత్తం క్షణాల్లో ఆవిరై పోయేలా కొన్ని కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖను రాజధానిగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
కోర్టు ఇబ్బందులను అధిగమించి తన ఆకాంక్షను నెరవేర్చుకోవాలని చూస్తున్నారు.అందుకే విశాఖకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, అక్కడ తమకు తిరుగులేకుండా చేసుకుంటున్నారు.
తెలుగుదేశం కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను కాస్త ఆ పార్టీకి దూరం చేయగలిగారు.
అయితే అనుకోకుండా కొన్ని కొన్ని సంఘటనలు విశాఖలో చోటుచేసుకోవడం, అందులో జగన్ ప్రమేయం లేకపోయినా, కొంతమంది అధికారుల అత్యుత్సాహం, మరికొంతమంది వైసీపీ నేతల ఓవర్ యాక్షన్ కారణంగా జగన్ అభాసుపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.గతంలో మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో వైసిపి విమర్శల పాలైంది.
మాస్కులు కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదంటూ సుధాకర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం తో వైసిపి టిడిపి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతోనే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని నిరూపించే క్రమంలో చేసిన హడావుడి చివరకు ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసింది.ఇటీవల ఆయన గుండెపోటుతో మరణించడం, దానికి కారణం వైసిపి ప్రభుత్వమే అనే ప్రచారాన్ని టిడిపి చేసుకుంది.
ఇక కొద్ది రోజుల క్రితం విశాఖ లో ఫార్మసీ మహిళా ఉద్యోగిని పోలీసులు రోడ్డుపై వెళ్తుండగా ఆపడం, అక్కడ జరిగిన రచ్చ అంతా జనాల్లోకి వెళ్ళిపోయింది.ఇందులో తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే ప్రభుత్వమే అభాసుపాలు కావాల్సి వచ్చింది.ఇక విశాఖలో వికలాంగ బాలల కోసం ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ను జిహెచ్ఎంసి అధికారులు ఆకస్మాత్తుగా కూల్చివేశారు.అది జీహెచ్ఎంసీకి చెందిన భవనమే అయినా, ఈ కరోనా సమయంలో అది కూడా వికలాంగుల పాఠశాలను కూల్చడం, వారికి వేరే దారి చూపించకపోవడం వంటి కారణాలతో వైసిపి ప్రభుత్వ ప్రతిష్ట ఈ విషయంలో దెబ్బతింది.
ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో సంఘటనలు విశాఖలోనే చోటు చేసుకున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది.కేవలం కొంత మంది పార్టీ నాయకులు, అధికారులు అత్యుత్సాహంతో జగన్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తింటోంది.ఏ చిన్న విషయానికైనా రాద్ధాంతం చేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న టిడిపి వంటి ప్రతిపక్ష పార్టీలకు ఈ వ్యవహారాలు బాగా కలిసి వస్తున్నాయి.ప్రభుత్వంపై తాము చేస్తున్న పోరాటానికి ఇవన్నీ ఊపిరి పోస్తున్నాయి.
ఇలా చాలా సంఘటనలో జగన్ కు నేరుగా సంబంధం లేకపోయినా, అవన్నీ జగన్ మెడకు చుట్టుకుని చికాకు తెప్పిస్తున్నాయి.