దేశ 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, అగ్రరాజ్యానికి తొలి మహిళా, తొలి నల్లజాతి, తొలి ఆసియన్ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్లు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు.అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత దొడ్డిదారిలో ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని ట్రంప్ చేసిన విన్యాసాలతో బైడెన్ దేశ పగ్గాలు చేపట్టడం ఓ ప్రహసనంలా మారింది.
అయినప్పటికీ ఎన్నో ఆకాంక్షలు, ఆశల మధ్య బాధ్యతలు చేపట్టిన జో.మే 20కి అధ్యక్షుడిగా నాలుగు నెలల కాలాన్ని పూర్తి చేసుకున్నారు.ఈ నేపథ్యంలో ఈ 120 రోజుల పాలనలో అమెరికన్ల ఆకాంక్షల్ని బైడెన్ అందుకోగలిగారో లేదో చూస్తే.
ఆయనకు అధికారం చేపట్టే నాటికి ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకాయి.
ఏడాదిగా దేశాన్ని చుట్టుముట్టిన సమస్యలు.బైడెన్ను వైట్హౌస్కు ఆహ్వానించాయి.
కల్లోలం సృష్టిస్తున్న కరోనా.ఆర్థిక అత్యవసర పరిస్థితి.
దేశంలో భద్రతాపరమైన సమస్యలు.ట్రంప్పై ఇంపీచ్మెంట్ ప్రక్రియ, ఇమ్మిగ్రేషన్ పాలసీలో సంస్కరణలు, విదేశాలతో సంబంధాల పునరుద్దరణ, వాతావరణ మార్పులు వంటి ఎన్నో అంశాలు బైడెన్ సామర్ధ్యానికి పరీక్ష పెడతాయని అందరూ భావించారు.
ఇక వర్గాలుగా విడిపోయిన అమెరికన్లను ఏకం చేయాల్సిన బాధ్యత సైతం ఆయనపైనే వుంది.కానీ ఆయన ఎక్కడ బెదరలేదు.
తన సుదీర్ఘ రాజకీయ అనుభవానికి పదును పెట్టి సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేశారు.
ముందుగా దేశాన్ని వణికిస్తున్న కరోనా జోరుకు కళ్లెం వేయాలని భావించారు.
మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని భావించిన ఆయన ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించాలని కంకణం కట్టుకున్నారు.అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన ఫోకస్ మొత్తం కరోనా మీదనే.
అందుకు తగ్గట్టుగానే 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయంతో.మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని అందుకున్నారు.దీంతో బైడెన్ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు.
దాన్ని కూడా 10 రోజుల ముందే.అంటే 90 రోజుల్లోనే ఛేదించారు.
ఫలితంగా.ఒకప్పుడు రోజుకు 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో వణికిపోయిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది.కానీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, జూలై 4 నాటికి దేశాన్ని కరోనా ఫ్రీగా చేయాలని బైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
కరోనా మహమ్మారి వల్ల ఆర్ధికంగా, సామాజికంగా ఎంతో నష్టపోయిన అమెరికన్లను ఆదుకునేందుకు గాను జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకేజ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.ద అమెరికన్ రెస్క్యూ ప్లాన్’ పేరుతో ప్రకటించిన ఈ బిల్లుకు ఇటీవల సెనేట్, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలపగా, బైడెన్ సంతకంతో చట్టంగా మారింది.దీంతో ఈ ప్యాకేజ్ ఫలాలను ప్రజలకు పంచడం ప్రారంభించింది ఫెడరల్ ప్రభుత్వం.
దీని ద్వారా సుమారు 400 బిలియన్ డాలర్లు అమెరికన్లకు ఆర్థిక సాయంగా అందనుంది.ఏడాదికి 75 వేల డాలర్లు సంపాదిస్తున్న ఒక్కొ అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లు (సుమారు రూ.లక్ష) జమ చేయనున్నారు.దీనిలో భాగంగా మార్చి 14 నుంచి 1400 డాలర్ల పంపిణీని ప్రారంభించినట్లు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) వెల్లడించింది.
ఈ పేమెంట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఐఆర్ఎస్ పేర్కొంది.అలాగే ఈ ప్యాకేజీ ద్వారా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు 350 బిలియన్ డాలర్లు.నిరుద్యోగులకు సెప్టెంబర్ వరకు ప్రతి వారం 300 డాలర్ల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తారు.దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్, టెస్టుల కోసం మరో 50 బిలియన్ డాలర్లు కేటాయించనున్నారు.
ప్రజలను కరోనా నుంచి స్వల్పంగానైనా ఉపశమనం దక్కేలా బైడెన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ట్రంప్ హయాంలో అపకీర్తి పాలైన అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే తన లక్ష్యమని తెలిపిన జో బైడెన్ అన్న మాట ప్రకారం.
విదేశాంగ విధానం, ఇమ్మిగ్రేషన్ పాలసీలో కీలక మార్పులను తీసుకొస్తున్నారు.హెచ్ 1 బీ వీసా లాటరీ విధానం మరికొంతకాలం కొనసాగించారు.గ్రీన్కార్డుల జారీకి సంబంధించి దేశాలపై వున్న 7 శాతం కంట్రీ క్యాప్ పరిమితిని రద్దు చేసేందుకు కాంగ్రెస్లో బిల్లును సైతం ప్రవేశపెట్టారు.అలాగే ట్రంప్ చేపట్టిన మెక్సికో గోడ నిర్మాణాన్ని రద్దు చేసి అక్రమ వలసదారులను దశలవారీగా అమెరికాలోకి అనుమతిస్తున్నారు.
ఇక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా వైదొలిగిన విషయం తెలిసిందే.అయితే బైడెన్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మళ్లీ ప్యారిస్ ఒప్పందంలో అమెరికా చేరుతుందని ప్రకటించారు.అప్పుడే ఇందుకు సంబంధించి సంతకం చేశారు కూడా.ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది.107 రోజుల అనంతరం ఫిబ్రవరి 19 నుంచి అమెరికా అధికారికంగా ఈ ఒప్పందంలో చేరింది.
బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికా ఆర్థిక అభివృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో 6.3శాతం నమోదు కావడం విశేషం.ఇది గత ఏడాది 2020 చివరి త్రైమాసికం నమోదు 4.3శాతం కంటే రెండు శాతం ఎక్కువ.2012 నుండి 2020 చివరి వరకు అన్ని త్రైమాసికాల కంటే 2021 మొదటి త్రైమాసికంలోనే అత్యధిక వృద్ధి రేటు నమోదు కావడం గమనార్హం.100 రోజుల పాలనలోనే 15 లక్షల 72 వేల కొత్త ఉద్యోగాలను బైడెన్ సృష్టించారు.అమెరికా చరిత్రలో 1939 నుంచి ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడూ మొదటి వంద రోజుల పాలనలో ఇన్ని ఉద్యోగాలు సృష్టించలేదు.
అలాగే దాదాపు 150 లక్షల కోట్ల రూపాయలను అమెరికా ప్రజల వైద్యం కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు.వచ్చే పదేండ్లలో 97శాతం జనాభాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే విధంగా చేయడం, అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న 39.6 శాతం ట్యాక్స్ పేయర్స్ నుంచి అదనంగా 4 లక్షల ట్రిలియన్ డాలర్లను పన్నుగా వసూలు చేసి ఆదాయం పెంచడం, కార్పొరేట్ ట్యాక్స్ను 28 శాతానికి పెంచడంతో పాటు కాలేజీ చదివే విద్యార్థుల కోసం దాదాపు కోటి రూపాయలను బైడెన్ ఉచితంగా లోన్లు ఇచ్చారు.నిరుద్యోగ యువతకు ‘పనిహక్కు’ చట్టాన్ని తీసుకొచ్చి గంటకు 15 డాలర్ల వేతనం నిర్ణయించారు.
ఇక అధ్యక్ష అభ్యర్ధిగా బరిలోకి దిగిన నాటి నుంచి భారతీయులకు పెద్ద పీట వేస్తూ వచ్చిన బైడెన్.అగ్రరాజ్యాధినేతగా ఇండో అమెరికన్లకు కీలక పదవులు కట్టబెట్టారు.కమలాహారిస్, వివేక్ మూర్తి, నీరా టాండన్, మజూ వర్గీస్, వినయ్ రెడ్డి,వేదాంత్ పటేల్,వనితా గుప్తా, ఉజ్రా జాయే, మాలా అడిగా,గరీమా వర్మ,సబ్రీన్ సింగ్, సమీరా ఫజిలి, భరత్ రామ్మూర్తి తదితరులు ఆయన జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.