అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.
ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.
బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు భద్రతా దళాలు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.
దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలింది.
గతంలో ఏ అధ్యక్షుడికి రానంత అప్రతిష్టను ట్రంప్ మూట కట్టుకోవాల్సి వచ్చింది.అంతేనా ఆయనను జనవరి 20కి ముందే పదవిలోకి దించాలని డెమొక్రాట్లు ప్రయత్నించారు.
తద్వారా అగ్రరాజ్య చరిత్రలో రెండు సార్లు అభిశంసనను ఎదుర్కొన్న దేశాధ్యక్షుడిగా ట్రంప్ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.కోర్టుల్లో దావాలు, తదితర అంశాలతో ట్రంప్పై ఎలాగైనా చర్యలు తీసుకోవాలని డెమొక్రాట్లు భావించారు.
అయితే రిపబ్లికన్లు ఈ ప్రయత్నాలకు పదే పదే అడ్డుపడుతున్నారు.తాజాగా 2022 మధ్యంతర ఎన్నికలకు ముందు క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర కమీషన్ ఏర్పాటును సెనేట్లో రిపబ్లికన్లు అడ్డుకున్నారు.
అమెరికా క్యాపిటల్ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ‘9/11’ తరహా స్వతంత్ర కమిషన్ను కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తెలిపిన సంగతి తెలిసిందే.జనవరి 6న జరిగిన హింసకాండకు గల కారణాలపై దర్యాప్తు చేసి నిజానిజాలపై కమిషన్ నివేదిక అందిస్తుందని చెప్పారు.
అలాగే శాంతియుత అధికార బదిలీలో జోక్యంపైనా కమిషన్ విచారణ చేయనున్నట్లు వెల్లడించారు.
రోజులు గడుస్తున్నా క్యాపిటల్ భవనంపై దాడికి దారి తీసిన కారణాలు ఎంటన్నది బయటకు మాత్రం రాలేదు.తాజాగా ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన సెనేట్ బృందం నివేదికను సమర్పించింది.దీని ప్రకారం.
భద్రతా సంస్థల మధ్య సమన్వయ లోపం వల్లే క్యాపిటల్ భవనంపై దాడి జరిగినట్లు సెనేట్ తమ తాజా నివేదికలో వెల్లడించింది.దాడి ప్రణాళికలకు సంబంధించి ముందే హెచ్చరికలు అందినప్పటికీ వాటిని ఉన్నత స్థాయి నాయకత్వానికి అందించడంలో నిఘా వర్గాలు పూర్తిగా విఫలమైనట్లు సెనేట్ బృందం పేర్కొంది.
ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే.క్యాపిటల్ భవనం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని సెనేట్ అభిప్రాయపడింది.అన్నట్లు ఈ దర్యాప్తు బృందంలో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన వారు ఉండడంతో అసలు ఈ దాడికి దారి తీసిన కారణాలపై గానీ, ట్రంప్ పాత్రపైగానీ ఎలాంటి ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం.