అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఎంతో వివాదాస్పదంగా మారాయన్న విషయం అందరికి తెలిసిందే.ముఖ్యంగా సరిహద్దు గోడ నిర్మాణం, అక్రమ వలస దారులపై ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ట్రంప్ కు మాయని మచ్చగా మారాయి.
అంతేకాదు కోట్లాది రూపాయలు వెచ్చించి మరీ సరిహద్దు గోడ నిర్మాణాన్ని చేపట్టాలని ట్రంప్ తీసుకున్న చర్యలు కూడా ఎన్నో విమర్సలకు దారి తీశాయి.బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత గోడ నిర్మాణానికి సంభందించిన నిధులను నిలిపివేయడం జరిగింది.
అయితే ట్రంప్ అప్పట్లో వలస వాసులపై తీసుకున్న చర్యలలో జీరో టోలరెన్స్ విధానం వలన ఎంతో వలస వాసుల పిల్లలు తమ తల్లితండ్రులకు దూరం అయ్యారు.
బిడెన్ అధ్యక్షుడు అయిన తరువాత ఆయన సతీమణి జిల్ బిడెన్ వలస వాసుల పిల్లలు తల్లి తండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియక బాధపడటం చూడలేకపోయారు.
దాంతో వారిని వారి తల్లి తండ్రుల వద్దకు చేర్చాలని ఆదేశించారు.అప్పటి నుంచీ చర్యలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా ఎంతో మంది పిల్లలు తల్లి తండ్రులకు దూరమయ్యారు అనే విషయాలను వెల్లడించింది.
ట్రంప్ పరిపాలన సమయంలో దాదాపు 3900 మంది పైన చిన్నారులు తమ తల్లి తండ్రులకు దూరమయ్యారని ప్రకటించింది.
ఇలా విడిపోయిన పిల్లలు అందరూ అమెరికా- మెక్సికో బోర్డర్ వద్ద విడిపోయారని ట్రంప్ ప్రవేశపెట్టిన జీరో టోలరెన్స్ విధానం కారణంగానే ఇంతటి ఘోరం జరిగిందని ఇప్పుడు వీరందరినీ వారి వారి తల్లి తండ్రులతో కలపడానికి చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది.ట్రంప్ ప్రజల మధ్యకు వచ్చిన సమయంలో బిడెన్ ప్రభుత్వం కావాలని ఇలాంటి విషయాలు వెల్లడిస్తోందని అమెరికాలో అక్రమంగా ప్రవేశం లేదని తెలిసినపుడు ఎందుకు పిల్లలతో వచ్చారని, అలా చేయడం వలన వలసలు తగ్గాయని రిపబ్లికన్ పార్టీ నేతలు ట్రంప్ ను వెనకేసుకొస్తున్నారు.