టిఆర్ఎస్ ను వీడి బిజెపి లో చేరబోతున్న ఈటెల రాజేందర్ వ్యవహారంతో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చినట్లుగా కనిపిస్తోంది.రాజేందర్ తో పాటు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు టీఆర్ఎస్ అసంతృప్తులు పెద్ద ఎత్తున బిజెపిలో చేరుతారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
అంతేకాదు టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారని బిజెపి సంబరపడుతోంది.టిఆర్ఎస్ నుంచి ఒక్కో నాయకుడు బయటకు వచ్చేస్తారని, వారందరినీ కలుపుకుని బలమైన శక్తిగా తెలంగాణలో బల పడవచ్చు అని బీజేపీ నమ్మకం పెట్టుకుంది.
ఆ ఉత్సాహంతోనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ పై మరింత ఘాటుగా స్పందించారు.తెలంగాణ రాజకీయాల్లో సమూల ప్రక్షాళన మొదలైందని, నిజాం పరిపాలన ను తలపించేలా టిఆర్ఎస్ పరిపాలన ఉందని ప్రజలంతా ఈ విషయాన్ని గమనిస్తున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు.
ఈటెల రాజేందర్ వంటి ఉద్యమ నాయకుడుకే టిఆర్ఎస్ పార్టీలో పరిస్థితి ఈ విధంగా ఉంటే , మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటో ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆలోచించుకోవాలని సూచించారు.తెలంగాణ ఉద్యమకారులను రక్షించుకునే పార్టీ బీజేపీ అని, తెలంగాణలో టిఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము తమ పార్టీకి మాత్రమే ఉందంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.
కెసిఆర్ తనకు అనుకూలమైన వారిని మంత్రులుగా ఉంచుతున్నారని, ఈ ప్రభుత్వంలో ఎంతో అవినీతి వ్యవహారాలు చోటుచేసుకున్నాయని, వారందరి చిట్ట తాము బయటకు తీస్తున్నామని సంజయ్ హెచ్చరించారు.కేవలం తమవి ఆరోపణలు మాత్రమే కాదని అన్నిటికీ ఆధారాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
సంజయ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి వ్యవహారాలకు సంబంధించి ఆధారాలను సంపాదించినట్లు కనిపిస్తున్నారు.
అలాగే మొదటి నుంచి టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన రాజేందర్ పార్టీలో చేరితే ఆ పార్టీ లోని కీలక నాయకులు వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయని, దాని ద్వారా టిఆర్ఎస్ ను ఇరుకున పెడదామని ఆలోచనతో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.ఎలా చూసుకున్నా ఈటెల రాజేందర్ బీజేపీ లో చేరిన తరువాత టిఆర్ఎస్ కు కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.దానికి ముందు శాంపిల్ గా సంజయ్ ఈ తరహా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.