ఏపీలో బీజేపీ వైసీపీ మధ్య శత్రుత్వం ఉన్నా, కేంద్రంలో బీజేపీ తో జగన్ స్నేహం గా ఉంటూ ఆపద సమయంలో కేంద్రానికి అండగా నిలబడుతూ వస్తున్నారు.బిజెపి జగన్ విషయంలో సానుకూలంగా ఉంటుందని, ప్రధాని నరేంద్రమోదీ సైతం జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చాలా కాలం నుంచి అనేక సంకేతాలు వస్తూనే ఉన్నాయి.
అందుకే ప్రధాని కి అండగా నిలబడాలి అంటూ, ఈ సమయంలో రాజకీయాలు సరికాదంటూ ఏపీ సీఎం జగన్ సైతం దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ లేఖలు రాయడం వంటివి ఎన్నో చోటు చేసుకున్నాయి.ఈ విషయంలో జగన్ కేంద్రానికి అండగా నిలబడ్డారు.
అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం జగన్ తో బీజేపీ పెద్దలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా జగన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా, వారికి ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో దానిని రద్దు చేస్తుండడంతో ప్రతిసారి ఢిల్లీ కి వెళ్తున్నాను అంటూ జగన్ హడావుడి చేయడం , అపాయింట్ మెంట్ ఖరారైంది అని, కేంద్ర బీజేపీ పెద్దలను కలవబోతున్నట్టు పత్రికా ప్రకటనలు ఇవ్వడం, చివరకు ఢిల్లీకి వెళ్లి అపాయింట్మెంట్ దొరక్క వెనక్కి వచ్చేయడం వంటివి గత కొంతకాలంగా షరా మామూలు గా మారిపోయాయి.
తాజాగా ఈ రోజు జగన్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నా, ఆ టూర్ ను రద్దు చేసుకున్నారు.దీనికి కారణం అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోవడమే.కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ ఖరారైంది.కానీ అమిత్ షా వంటి వారిని కలవకుండా మిగిలిన మంత్రులు కలిసిన పెద్దగా ఉపయోగం ఉండదనే అభిప్రాయంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఇప్పటికే మూడు, నాలుగు పర్యాయాలు ఇదే చోటు చేసుకోవడంతో జగన్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఢిల్లీ పెద్దలు తమను ఎందుకు ఈ విధంగా దూరం పెడుతున్నారు అని, తమకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు రద్దు చేస్తున్నారనే విషయం జగన్ కు సైతం అంతు పట్టడం లేదు.
ప్రస్తుతం ఏపీ కి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలతో పాటు, తమను తరచుగా ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలోనూ బిజెపి పెద్దల నుంచి స్పష్టమైన క్లారిటీ తీసుకోవాలని జగన్ భావించారు.ఈ మేరకు ఆయనకు సంబంధించిన అన్ని ఆధారాలను జగన్ తన వెంట తీసుకు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలోనే ఆయన అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.కానీ ప్రతి సారి ఇదే తంతు చోటుచేసుకోవడం తో జగన్ ను బిజెపి పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలను జగన్ ఎదుర్కోవాల్సి వస్తోంది.
.