వైసిపి గెలిచిన దగ్గర నుంచి విశాఖ పేరుని పదే పదే ప్రస్తావిస్తోంది.జగన్ తలపెట్టిన మూడు రాజధానులు వ్యవహారం లో విశాఖ కీలకంగా మారింది.
పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన జగన్ అక్కడ రాజధాని అధికారికంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారు.అయితే కోర్టు చిక్కులు ఉండడంతో దానికి బ్రేకులు పడ్డాయి.
అయినా పరిపాలన రాజధానిగా అనధికారికంగా విశాఖను ప్రకటించేసుకున్న వైసీపీ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుతో పాటు అక్కడి నుంచి జగన్ పరిపాలన కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి.తాను ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని ప్రాంతం గా జనాలు గుర్తిస్తారని భావిస్తున్న జగన్ ఈ మేరకు తన ఆలోచనలను అమలు చేస్తున్నారు. ఇక మొన్నటి వరకు ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగినట్టు గా కనిపించినా, మళ్లీ వైసిపి నాయకులు అంతా పదేపదే విశాఖ పేరు ప్రస్తావిస్తున్నారు.వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వంటివారు ఈ వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయ్యి మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో హడావుడి పడుతోంది.
తాము ప్రకటించిన అన్ని హామీలు అమలు చేస్తున్నా, కీలకమైన రాజధాని వ్యవహారంలో అడుగులు ముందుకు పడకపోవడంతో అది తమకు ఉందని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తే జనాల్లో ను విశాఖ పరిపాలన రాజధాని అయ్యింది అనే సంకేతాలు ఇస్తోంది. మూడు రాజధానుల అంశంలో జగన్ ప్రభుత్వానికి ముందరి కాళ్ళ బంధం వేశామని భావిస్తున్న ప్రతిపక్షాలకు, ఆ అవకాశం లేకుండా చేయాలి అంటే ఇదే రాజకీయ ఎత్తుగడ తో ముందుకు వెళ్లాలనేది వైసిపి ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.త్వరలోనే జగన్ పరిపాలన తాడేపల్లి నుంచి విశాఖకు షిఫ్ట్ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి.