వైసీపీలోనే ఉంటూ, ఆ పార్టీని , ఆ పార్టీ అధినేత జగన్ ను తిడుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన హడావుడి కొద్ది రోజులుగా చూస్తునే ఉన్నాం.ఆయన జగన్ ఆగ్రహానికి గురి కావడంతో ఆయన పై అనేక కేసులు నమోదు చేసి సిఐడి పోలీసులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం ఆయన వ్యవహారం ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.ఎవరు ఊహించని విధంగా రఘురామ కృష్ణంరాజుకు టిడిపి బిజెపి లు అండగా నిలబడ్డాయి .వైసీపీపై పెద్ద ఎత్తున ఆ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.ఈ విషయంలో బీజేపీ కంటి టిడిపినే ఎక్కువగా స్పందిస్తుంది.
అంతే కాదు అన్ని రకాలుగా ఆయనకు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తోంది .టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఉన్న కీలక నేతలందరికీ లేఖలు రాస్తూ, ఈ వ్యవహారానికి జాతీయస్థాయిలో ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఈ పరిణామాలు ఎక్కడ వరకు వెళతాయి అనేది పక్కన పెడితే, రఘురామకృష్ణంరాజు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రఘురామ కృష్ణంరాజు రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆయన మొదట్లో వైసీపీలో చేరారు ఆ తర్వాత బీజేపీ, టిడిపి లలో చేరి చివరకు మళ్లీ వైసీపీ నుంచి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి జగన్ గాలి లో విజయం సాధించారు.
ఇక ఆ పార్టీలో ఆయన ప్రయాణం సాఫీగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలోనే ఆ పార్టీ లోని కొంతమంది నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆయన సెటైర్లు వేసే వారు.దీనికి సదరు నాయకులు కౌంటర్ ఇవ్వడం, ఈ వ్యవహారాలను జగన్ పట్టించుకోనట్లు వ్యవహరించడం వంటి కారణాలతో తీవ్ర అసంతృప్తికి గురై, నేరుగా జగన్ పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే వరకు రఘురామకృష్ణంరాజు ముందుకు వెళ్లారు. బిజెపి ఢిల్లీ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతూ , పార్టీ పరంగా కాకుండా, తన సొంత ఇమేజ్ పెంచుకునే విధంగా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు.
ఇప్పుడు ఈ అరెస్టు తర్వాత బిజెపి ఏపీ నేతలు, టిడిపి నేతలు అంతా స్పందిస్తున్నారు.ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు .రఘురామ కు తమ అండదండలు ఉంటాయని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు.దీంతో రఘు రామ రాబోయే 2024 ఎన్నికలలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది కూడా చర్చకు వస్తోంది.ఆయన టీడీపీ నుంచి కానీ బిజెపి నుంచి గానీ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉన్నాయా ? పార్టీలను పక్కన పెడితే రఘురామకృష్ణంరాజు సొంతంగా గెలిచే అంత బలం సంపాదించుకున్నారా అనే విషయం పైన చర్చ జరుగుతోంది.