కరోనా వైరస్ మహమ్మారి ఏపీని కుదిపేస్తోంది.పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి.
ఎక్కడ చూసినా కరోనా బాధితుల ఆక్రందనలే కనిపిస్తున్నాయి.శరవేగంగా ఈ మహమ్మారి విస్తరిస్తూ వెళ్తుంది.
పొరుగున ఉన్న తెలంగాణ కంటే ఏపీలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.దీనికితోడు మౌలిక సదుపాయాల కొరత రోగులకు ఇబ్బందికరంగా మారింది.
ఆక్సిజన్, బెడ్ ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.ఆస్పత్రులలో సరైన వైద్య సదుపాయాలు అందక ఎంతోమంది ప్రాణాలు వదులుతున్న సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం.
అయితే కేవలం ఈ పరిస్థితి ఏపీలో మాత్రమే కాదు , దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.కాకపోతే ఈ కరోనా మహమ్మారి సోకిన వారు ఆ వైరస్ ప్రభావం కంటే, మానసిక ఆందోళనతోనే ఎక్కువగా మరణిస్తున్న సంఘటనలు ఉన్నాయి.
ఈ సమయంలో బాధితులకు భరోసా కల్పించే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాల్సి ఉన్నా, వారు సైలెంట్ అయిపోవడం విమర్శలకు కారణం అవుతోంది.ఎమ్మెల్యేలు కాస్తో కూస్తో జనంలో తిరుగుతూ, తమ నియోజకవర్గ పరిధిలో పర్యటన చేస్తూ కాస్త హడావుడి చేస్తున్న మంత్రులు మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
కేవలం ఒకరిద్దరు మాత్రమే మాట్లాడుతున్నారు.అయితే దీనంతటికీ కారణం కరోనా మహమ్మారి భయం ఒకటైతే, పార్టీ నుంచి అంతర్గతంగా వచ్చిన ఆదేశాలూ కారణంగా తెలుస్తోంది.
కరోనా విషయంలో ఎవరు ఏమి మాట్లాడవద్దని , కేవలం ఒకరిద్దరు మంత్రులు మాత్రమే ఈ వ్యవహారాలు చూసుకుంటారని, మౌఖిక ఆదేశాలు రావడంతో మంత్రులంతా ఈ విషయం లో సైలెంట్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అయితే ఈ విపత్కర సమయంలో మంత్రులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఆసుపత్రిల వద్ద కు వెళుతూ, బాధితులకు భరోసా కల్పిస్తూ, ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు పెంచే విషయంపై దృష్టి పెడితే బాగుండేది కానీ, కానీ పూర్తిగా మౌనం వహించడం సరికాదనే సూచనలూ అందుతున్నాయి.ఈ విషయంలో చాలామంది మంత్రులూ ఇదే అభిప్రాయంతో ఉన్నా, పై నుంచి వచ్చిన ఆదేశాలతో గప్ చుప్ అయిపోయినట్టు సమాచారం.