హెచ్ 1 బీ వీసాలు వున్న భారతీయ ఐటీ నిపుణుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్ ఇవ్వాలని కోరుతూ అమెరికాలోని టెక్ దిగ్గజాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.ఈ కంపెనీల బృందానికి గూగుల్ నాయకత్వం వహించనుంది.
హెచ్ 4 ఈఏడీ (ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) ప్రోగ్రామ్కు మద్ధతు ఇచ్చేందుకు గాను అమెరికాలోని 30 దిగ్గజ కంపెనీలు ఒక్క తాటిపైకి వచ్చాయి.ఈ బృందంలో గూగుల్ సైతం చేరింది.
హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు యూఎస్ సిటిజన్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) హెచ్ 4 వీసా జారీ చేస్తుంది.హెచ్ 1 బీ అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా.
ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు గాను అమెరికన్ కంపెనీలకు అనుమతిస్తుంది.ఈ వీసా కింద భారత్, చైనా తదితర దేశాల నుంచి ప్రతియేటా 10 వేల మంది ఉద్యోగులను టెక్ దిగ్గజాలు నియమించుకుంటున్నాయి.
దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.వలసదారులకు మద్ధతు ఇస్తున్నందుకు గూగుల్ గర్వపడుతోందన్నారు.ఉద్యోగాలు, అవకాశాలను సృష్టించేందుకు సహాయపడే హెచ్ 4 ఈఏడీ ప్రోగ్రామ్ను రక్షించడానికి తాము మరో 30 కంపెనీలతో గొంతు కలిపామని సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.దీనిలో భాగంగా సేవ్ జాబ్స్ యూఎస్ఏ వర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కేసులో గూగుల్ దావా వేసింది.
ఈ అమికస్ బ్రీఫ్పై అడోబ్, అమెజాన్, ఆపిల్, ఈబే, ఐబీఎం, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, పేపాల్, ట్విట్టర్ సంతకాలు చేశాయి.
కాగా, హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అది లభించడానికి సుమారు 15 ఏళ్లు పడుతుంది.
ఈలోగా హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామి అమెరికాలో ఉద్యోగంలో చేయడానికి అనుమతి ఉండేది కాదు.వీరి ఆవేదనను అర్ధం చేసుకున్న నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లో హెచ్ 4 ఈఏడీ (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) బిల్లు తెచ్చారు.
దీని ప్రకారం హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్కార్డు కోసం వేచి చూస్తున్న వారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించారు.దీనికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపింది.దీనివల్ల 1.34 లక్షల మంది భారతీయ మహిళలు యూఎస్సీఐఎస్ నుంచి ఈఏడీ పొంది తమకు నచ్చిన ఉద్యోగాల్లో చేరారు.
జీవిత భాగస్వామి హెచ్1బీ గడువుకు అనుగుణంగా హెచ్4 వీసా రెన్యూవల్ చేస్తారు.అయితే ఏడాదిన్నరగా కరోనా తదితర కారణాలతో యూఎస్సీఐఎస్ ఈఏడీ రెన్యూవల్ చేయట్లేదు.దీంతో మార్చి 31 నాటికి సుమారు 91 వేల మంది భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి వారి కుటుంబాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.ఈ నేపథ్యంలో హెచ్-4 వీసాల జారీలో సుదీర్ఘ జాప్యం చోటుచేసుకుంటుండటంపై అక్కడి ప్రవాస భారతీయ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు నిరసనగా కొద్దిరోజుల క్రితం కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో ‘సేవ్ హెచ్4ఈఏడీ’ పేరుతో ర్యాలీ నిర్వహించారు
.