మనదేశంలో ఏలాగూ ఐకమత్యంగా వుండకపోయినా.పరాయి గడ్డ మీద భారతీయులు తామంతా ఒకటేనని నిరూపించారు.
అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న తమ వారిని విడిపెట్టాలంటూ వందల సంఖ్యలో భారతీయులు నిరసన తెలిపి వారిని విడిపించారు.వివరాల్లోకి వెళితే.
స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలోని పొల్లాక్ షీల్డ్ ప్రాంతంలో లఖ్వీర్ సింగ్ (34)తో పాటు మరో భారతీయుడిని బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు అరెస్ట్ చేసేందుకు వచ్చారు.నిజానికి ఆ ప్రాంతం స్కాట్లాండ్ నియంత్రణలో వుంటుంది.
ఇమ్మిగ్రేషన్ నేరాలకు సంబంధించి వారిద్దరిని స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేయాలి.కానీ బ్రిటీష్ పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ విషయం ఆ ప్రాంతమంతా దావానంలా వ్యాపించింది.
వెంటనే అక్కడ స్థిరపడిన భారత సంతతి ప్రజానీకంతో పాటు స్థానికులు భారీగా పోగయ్యారు.బ్రిటన్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా, ఆ వ్యాన్ను అడ్డుకున్నారు.క్షణక్షణానికి ప్రజలు భారీగా పెరుగుతుండటంతో పోలీస్ వాహనం అంగుళం కూడా ముందుకు కదల్లేదు.అరెస్ట్ చేసిన ఇద్దరిని విడిచిపెట్టాలంటూ దాదాపు 8 గంటల పాటు పోలీసులను నిలబెట్టేశారు.
అయితే ప్రస్తుత కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఇద్దరు భారతీయులను బ్రిటన్ పోలీసులు విడుదల చేయడంతో వారిని జనం కదలనిచ్చారు.మరోవైపు బ్రిటన్ హోంశాఖ తీరుపై స్కాట్లాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమ ప్రాంతంలో బ్రిటన్ లేనిపోని సమస్యలు సృష్టిస్తోందని స్కాటిష్ మంత్రి నికోలా స్టర్జియన్ ఆరోపించారు.అటు స్కాట్లాండ్ ఆరోపణలపై బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ స్పందించారు.
ఇమ్మిగ్రేషన్ అక్రమాలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ను ప్రారంభించినట్లు ఆమె స్పష్టం చేశారు.అటు జరిగిన సంఘటనపై గ్లాస్గో సిక్కు సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా భారతీయులకు గమ్యస్థానాలుగా వున్న దేశాల్లో యూకే కూడా ఒకటి.అమెరికా, కెనడాల తర్వాత భారతీయ యువత డెస్టినేషన్ ఇంగ్లీష్ గడ్డే.అయితే విపరీతమైన పోటీ, చట్టబద్ధమైన లాంఛనాలు, భారీ వ్యయం కారణంగా కొందరు భారతీయులకు బ్రిటన్ వెళ్లడం కలగానే మారుతోంది.అయితే దొడ్డిదారిలో అయినా అక్కడికి వెళ్లాలని భావించి ట్రావెల్ ఏజెంట్లను ఆశ్రయించి యూకే అధికారులకు పట్టుబడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది.
ఈ క్రమంలోనే దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయులు సహా విదేశీయులను బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ఇటీవల అరెస్ట్ చేస్తోంది.