ఏపీకి చెందిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు జగన్ సర్కార్ నజరానా ప్రకటించింది.రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా విశాఖలో ఆమెకు రెండెకరాల స్ధలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఈ స్ధలంలో అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాలు కేటాయించింది.
విశాఖ గ్రామీణ మండల పరిధిలోని చినగదిలిలో 72/11, 83/5, 83/6 సర్వే నంబర్లలో పశు సంవర్థకశాఖకు చెందిన మూడు ఎకరాల్లో రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆ రెండు ఎకరాలను పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ కోసం ఇస్తుంది.అకాడమీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మూడేళ్ల కాలానికి ఐటీ రిటర్నులు సమర్పించడంతో పాటు నిబంధనల ప్రకారం మిగతా షరతులన్నీ పూర్తి చేశాక ఆ భూమిని పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి బదలాయిస్తారు.
ఇది ఏపీలో క్రీడాకారులను తయారు చేయడానికి సర్కార్ చేస్తున్న గొప్ప కార్యంగా జగన్ ఈ సందర్భంగా తెలియజేశారు. పీవీ సింధు లాగా ఆంధ్రప్రదేశ్ లో క్రీడల్లో రాణించాలని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.