దేనికైనా సమయం సందర్భం అనేది ఉంటుంది.సందర్భానుసారం మాట్లాడితే అది హుందాగా ఉంటుంది.
అలా కాకుండా ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడితే చివరకు అభాసుపాలు కావాల్సి ఉంటుంది.ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసిపి, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య కరోనా కట్టడి విషయంలో చోటు చేసుకుంటున్న రాజకీయం చూస్తుంటే, ఎప్పుడూ రాజకీయమేనా అన్న ప్రశ్న ఎదురవుతోంది.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది .భారత్ లో ఈ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది.రోజుకు దాదాపు నాలుగు లక్షల వరకు కొత్త కేసులు నమోదు అవుతుండడంతో ఆందోళన పెరిగిపోతుంది.ఇక ఏపీలోనూ ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.ఇక్కడ రోజుకు 20 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి.ఈ సమయంలో కరోనాను ఎదుర్కునేందుకు రాజకీయాలకు అతీతంగా, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన రాజకీయ పార్టీలు ఎప్పటిలాగే అసలు విషయాన్ని పక్కన పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఏపీలో కరోనా కేసుల తీవ్రతతో పాటు, మౌలిక సదుపాయాల కల్పన అంతంతమాత్రంగా ఉన్నాయి.ఆక్సిజన్ కొరత ఎక్కువగా వేధిస్తోంది.ఇటీవలే తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా దాదాపు 11 మంది మృతి చెందిన ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.ఇక ఏపీలో కరోనా తీవ్రత విషయంలో వైసిపి, టిడిపి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు కారణమవుతోంది.
కర్నూలులో ఎన్ కె 440 ఎస్ అనే వేరియంట్ వ్యాపించిందని స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రజలు భయబ్రాంతులకు గురి అయ్యే విధంగా వ్యాఖ్యానించారు.అయితే దీనిపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించారు.
అటువంటి రకం వైరస్ ఏదీ లేదని, అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించ లేదని చెప్పారు.
దీనిపైన చంద్రబాబుపై కేసు నమోదయింది.
చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, వైసిపి ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.ఇక ఏపీలో వ్యాక్సిన్ కొత్త ఏర్పడడానికి వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత కారణమని, వ్యాక్సిన్ సకాలంలో ఆర్డర్ పెట్టకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చినట్లు టిడిపి విమర్శలు చేస్తోంది .అయితే ఈ కొరత దేశమంతా ఉంది.130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో వాక్సిన్ ఉత్పత్తి 10 కోట్ల డోసులు కూడా దాటలేదు.90 శాతం వాటా గా ఉన్న కోవి షీల్డ్ ను ఉత్పత్తి చేసే సీరం ఇన్స్టిట్యూట్ కానీ, మిగిలిన 10 శాతం గా ఉన్న భారత్ బయోటెక్ కోవాగ్జిన్ కానీ మరో మూడు నెలలు అయినా దేశంలో అందరికీ అందుబాటులోకి వాక్సిన్ తీసుకొచ్చే అవకాశమే కనిపించడం లేదు.
ఇదంతా తెలిసినా టిడిపి ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తోంది.1600 కోట్లు కేటాయించలేక పోవడం వల్లనే వ్యాక్సిన్ కొరత వచ్చిందని టిడిపి ఆరోపిస్తోంది.దీనికి కౌంటర్ గా అదే సొమ్ములు మీకు ఇస్తామని, వ్యాక్సిన్ ఇప్పించాలి అంటూ చంద్రబాబుకు వైసీపీ సవాల్ విసురుతోంది.
భారత్ బయోటెక్ అధినేత ఒక తెలుగు మీడియా అధిపతి వియ్యంకుడు అని, టీడీపీకి బాగా చనువుగా ఉండే వ్యక్తి అని, మీరు తెప్పించినా మేము స్వాగతిస్తాము అంటూ వైసిపి వాదిస్తోంది.వ్యాక్సిన్ మేము తెప్పిస్తే ఇక మీరు ఎందుకు అంటూ చంద్రబాబు వైసీపీ పై ఎదురు దాడికి దిగుతున్నారు.
ఇలా వైసిపి, టిడిపి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నాయి తప్ప, కరోనా విషయంలో ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టే విషయంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు.ఈ క్లిష్ట సమయంలోనూ తమకు రాజకీయాలే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతోనే ఈ రకమైన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి.