దేశంలోని రాష్ట్రాలు కోవిడ్ ఉదృతి వల్ల లాక్డౌన్ పాటిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు లాక్డౌన్ ఊసే ఎత్తలేదు.కానీ హైకోర్టు మొట్టెకాయలు వేస్తే గానీ మేలుకోని ఈ ప్రభుత్వం హడావుడిగా రేపటి నుండే లాక్డౌన్ అంటూ గత సంవత్సరం చేసిన తప్పునే మళ్లీ చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
దూరప్రాంతాలకు వెళ్లే వారి గురించి ఆలోచించకుంటా ఇన్ని రోజులు కాలయాపన చేసిన ప్రభుత్వం సడెన్గా లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట.
ఇకపోతే బుధవారం నుండి ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మినహాయించి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో లాక్డౌన్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.ఆ వివరాలు చూస్తే.
వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.
ఇక వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.
జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.
జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు నిచ్చింది.
ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు.ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.
ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.అయితే ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి, అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా, అలాగే రేషన్ షాపులు, కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది.
ఇకపోతే సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.