టీమిండియాకి హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను బీసీసీఐ ప్రకటించింది.జూన్ 2న ఇంగ్లాండ్ పర్యటనకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లోని భారత్ టెస్టు జట్టు వెళ్లనుంది.
అయితే జులైలో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ కోసం మరో జట్టుని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ పంపనుంది.దీంతో ఈ రెండవ జట్టుకి కోచ్ గా రాహుల్ ద్రవిడ్ అక్కడికి వెళ్లబోతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
ఇంగ్లాండ్ గడ్డపై న్యూజిలాండ్ తో సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో తలపడనున్న భారత్ ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో పాల్గొనబోతోంది.ఈ మేరకు ఇప్పటికే 20 మందితో కూడిన జట్టుని భారత సెలెక్టర్లు ప్రకటించారు.
ఈ టీమ్ మొత్తం జూన్ 2న చీఫ్ కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో ఇంగ్లాండ్ కి బయల్దేరనుంది.ప్రతిష్ఠాత్మక టూర్ కావడంతో అతనితో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లు కూడా వెళ్లబోతున్నారు.
ఇంగ్లాండ్ టూర్ కి భారత టెస్టు జట్టులోకి ఎంపికవని ఆటగాళ్లతో ఓ జట్టుని ఎంపిక చేసి శ్రీలంకకి పంపాలని బీసీసీఐ భావిస్తోంది.జులైలో అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లను భారత్ జట్టు ఆడనుండటం, కోచ్లందరూ ఇంగ్లాండ్కి వెళ్లనుండటంతో రాహుల్ ద్రవిడ్ ని ఈ టూర్కి కోచ్గా వ్యవహరించమని బీసీసీఐ కోరింది. దీంతో ద్రవిడ్తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ లోని సపోర్ట్ స్టాఫ్ కూడా శ్రీలంకకు వెళ్లేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.
క్రికెటర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే ఓపెనర్ శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, రాహుల్ తెవాటియా తదితరులు ఉన్నారు.
శ్రీలంక టూర్ కి వెళ్లే జట్టుకు కెప్టెన్ గా ఎవరనేది ఇప్పటి వరకూ బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు.