ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.ఎప్పుడు ఎవరి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తెలియని ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.
ఇప్పటికే టిఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉంటూ, కీలక నేతగా ఎదిగిన ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కెసిఆర్ బర్తరఫ్ చేశారు.అలాగే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ను అరెస్ట్ చేశారు.
హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు మొన్నటి వరకు పరారీలో ఉన్నారు.అకస్మాత్తుగా ఈటెల రాజేందర్ వ్యవహారం బయటకు రావడం , ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేయడం తో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది.
దీంతో పాటు , తెలంగాణ మంత్రివర్గంలో ఉన్న కొంతమంది పనితీరుపై కేసీఆర్ చాలాకాలం నుంచి ఆగ్రహం గా ఉన్నారు అనే సంకేతాలు వచ్చాయి.
కేటీఆర్ విషయంలో సదరు మంత్రుల వ్యవహార శైలిపై అసంతృప్తితో కొంతమంది ఉంటున్నారు అనే సంకేతాలతో త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడంతో పాటు , జిల్లాల వారీగా , మండలాల వారీగా ఎవరెవరు టిఆర్ఎస్ పై అంకిత భావంతో ఉన్నారు ? ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు అనే దానిపై పార్టీ పరంగా నివేదికలు తెప్పించుకుని, యాక్టివ్ గా లేని నాయకులను, అలాగే పార్టీలోనే ఉంటూ పార్టీకి చేటు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న వారి పైన వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.అలాగే కేటీఆర్ నాయకత్వం పైన అసంతృప్తితో ఉన్న వారి విషయంలోనూ ఇకపై ఉపేక్షించకూడదు అనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా సంకేతాలు వస్తుండటంతో, టిఆర్ఎస్ మంత్రులతో పాటు, ద్వితీయశ్రేణి నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్న పరిణామాలపై ఎవరు బహిరంగంగా నోరు తెరిచి తన అభిప్రాయం చెప్పే సాహసం చేయడం లేదు.
ఇటీవల దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి ఒక్కసారిగా బలం పెంచుకోవడానికి కారణం సొంత పార్టీ నేతల వ్యవహార శైలి అనేది కెసిఆర్ గ్రహించారు.అందుకే అప్పటి నుంచి కొంత కాలం పాటు సైలెంట్ గానే ఉన్న ఆయన ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచినట్లు గా కనిపిస్తున్నారు.2023 ఎన్నికల నాటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే పరిస్థితి చక్కదిద్దుకుంటూనే తమ రాజకీయ ప్రత్యర్ధులకు ఎక్కడ అవకాశం లేకుండా చేయవచ్చని నమ్ముతున్నారు.గెలుపునకు అనువైన పరిస్థితులను ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.