ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగుతోంది.ఆయన రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించిన ప్రతి పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన డిమాండ్ పెరగడంతో పాటు, పీకే రాజకీయ వ్యూహాలు అనుసరించి ముందుకు వెళితే తప్పకుండా అధికారంలోకి వస్తామనే అభిప్రాయం అన్ని రాజకీయ పార్టీలలోనూ నెలకొంది.
ఇక ఆయనకు కూడా బిజెపి వ్యతిరేక పార్టీలకు మద్దతుగా రాజకీయ వ్యూహాలు అందించేందుకు ఆసక్తిగా ఉంటున్నారు.పశ్చిమ బెంగాల్ లో మమత, తమిళనాడు లో స్టాలిన్ , ఢిల్లీలో కేజ్రీవాల్ ఇలా ఎంతో మందికి రాజకీయ వ్యూహాలు అందించి వారిని అధికారంలోకి తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవాలని టిఆర్ఎస్ సిద్ధమైంది.ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.అసలు పీకే సేవలను టిఆర్ఎస్ ఉపయోగించుకోవాలని అనుకోవడానికి ప్రధాన కారణం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరగడమే.నిరుద్యోగులతో పాటు, యువత , మహిళల్లోనూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందని ,అలాగే సొంత పార్టీలో అసంతృప్తులు పెరిగారు అనే విషయాన్ని గుర్తించిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తలు అవసరం ఉందని అభిప్రాయం పడడం తోనే వ్యూహకర్తగా నియమించినట్లు తెలుస్తుంది .ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీమ్ హైదరాబాద్ కు చేరుకోవడమే కాకుండా, అనేక కీలక అంశాలపై టిఆర్ఎస్ నేత కె కేశవ రావు తో భేటీ అయినట్లు తెలుస్తోంది.
మరికొద్ది రోజుల్లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమగ్రంగా అన్ని విషయాల పైన చర్చించి , రాజకీయ వ్యూహాలను అమలు చేసే దిశగా పీకే టీం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
అసలు షర్మిల పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అందిస్తారని ప్రచారం పెద్ద ఎత్తున జరిగినా, ఇప్పుడు టిఆర్ఎస్ తో ఆయన ఒప్పందం చేసుకోవడం కొసమెరుపు.