కరోనా మహమ్మారితో అల్లాడుతున్న భారత్కు సాయాన్ని మరింత పెంచాలంటూ అమెరికాకు ఒత్తిడి పెరుగుతోంది.ఇండో అమెరికన్ పౌరులు, ప్రజా సంఘాలు, కాంగ్రెస్ సభ్యులు, డెమొక్రాటిక్ నేతలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
తాజాగా భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ సైతం వీరితో గొంతు కలిపారు.కోవిడ్తో అత్యంత దారుణ పరిస్థితుల్లో వున్న భారత్ను ఆదుకోవడం అమెరికా నైతిక బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.
నాలుగు లక్షలకు పైగా కేసులతో ఇండియాలో ప్రస్తుతం దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ఈ నేపథ్యంలో అక్కడ బెడ్లు, ఆక్సిజన్ కొరత వేధిస్తోందని ప్రమీల అన్నారు.
కాగా, ప్రమీలా జయపాల్ తల్లిదండ్రులు ఇటీవల కోవిడ్ బారనపడటంతో వారిని పరామర్శించేందుకు ఆమె భారత్కు వచ్చారు.
ఇదే సమయంలో అమెరికాలో భారత రాయబారి తరణ్జీత్ సింగ్ సంధుతో జరిగిన వర్చువల్ సమావేశంలో పాల్గొని దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, అమెరికా నుంచి అందుతున్న సాయంపై చర్చించారు.ఈ సందర్భంగా టీకా ముడి సరుకు కోసం గత కొద్దిరోజులుగా భారత్ చేస్తున్న విజ్ఞప్తిపై స్పందించాలని తాను బైడన్ను కోరినట్టు ప్రమీల చెప్పారు.
దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఆమె వెల్లడించారు.ప్రపంచంలో తయారైన మొత్తం వ్యాక్సిన్లలో 80 శాతం ధనిక దేశాల వద్దే వుందని.ఇదే సమయంలో పేద దేశాల వద్ద 0.3 శాతం టీకా నిల్వలు ఉన్నాయని జయపాల్ వివరించారు.ఈ అన్యాయాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ దృష్టి సారించిందన్నారు.దీనిలో భాగంగా ఆయా దేశాల రాయబారులు, సంస్థలతో పాటు ఫెడరల్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ప్రమీలా జయపాల్ వెల్లడించారు.
2017 నుంచి వాషింగ్టన్ 7వ కాంగ్రెస్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమీలా జయపాల్ బడ్జెట్ ఆమోదంలో కీలకపాత్ర పోషిస్తున్న హౌస్ బడ్జెట్ కమిటికీ సభ్యురాలిగా ఎంపికయ్యారు.ఈ కమిటీకి జాన్ యర్మూత్ అధ్యక్షత వహిస్తారు.అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్ మహిళగా జయపాల్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.దేశంలోని కార్మికులు తమ శ్రమకు ప్రతిఫలంగా గంటకు 15 డాలర్లను కనీస వేతనంగా అందుకోవాలనే ఉద్దేశ్యంతో జయపాల్ పనిచేస్తున్నారు.