భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించడంతో పాటు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని జైలుకు పంపుతామంటూ హెచ్చరించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కాస్త మెత్తబడ్డారు.భారత్లో చిక్కుకున్న వారిని తిరిగి స్వదేశానికి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు.
భారత్పై విధించిన ట్రావెల్ బ్యాన్ మే 15తో ముగుస్తుందని.ఆ తర్వాత ఇండియాలో చిక్కుకున్న ఆస్ట్రేలియన్లు ప్రయాణించేందుకు వీలుగా విమానాలు నడిపే అంశంపై నిర్ణయం తీసుకుంటామని మోరిసన్ తెలిపారు.
ప్రధాని నిర్ణయంతో స్వదేశానికి వచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న 900 మంది ఆస్ట్రేలియన్లకు ఊరట లభించినట్లయ్యింది.భారత్లో దాదాపు 9,000 మంది ఆస్ట్రేలియా పౌరులు వున్నట్లు అంచనా.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే మే మూడో వారం నుంచి భారత్కు ఆస్ట్రేలియా విమానాలు నడిపే అవకాశం వుంది.ఇదే సమయంలో భారత్ నుంచి వచ్చే వారిని క్వారంటైన్ చేసేందుకు ది హోవర్డ్ స్ప్రింగ్ క్వారంటైన్ కేంద్రం సామర్ధ్యాన్ని 2,000 పడకలకు పెంచనున్నారు.
కాగా, భారత్లో సెకండ్ వేవ్ కారణంగా ఇక్కడి నుంచి వచ్చే విమానాలపై ఆయా దేశాలు నిషేధం విధించాయి.కానీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాత్రం కాస్తంత ఓవరాక్షన్ చేశారు.
మే 15 వరకు భారత విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు.అదే సమయంలో భారత్ నుంచి వచ్చేవారితో పాటు సొంత పౌరులపైనా ఆయన బ్యాన్ విధించారు.ఇండియాలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు స్వదేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల పాటు జైలుశిక్ష, రూ.49 లక్షల వరకు జరినామా విధిస్తామని మోరిసన్ హెచ్చరించారు.అయితే ప్రధాని నిర్ణయంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్లో క్లిష్ట పరిస్థితుల మధ్య వున్న ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేయాలేకాని బెదిరించడం ఏంటని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ నిర్ణయం పట్ల అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి.నీకెంత ధైర్యం.
నీ చేతులకు రక్తం అంటుకుంది అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.అయితే ఈ నిషేధాన్ని మోరిసన్ సమర్థించుకున్నారు.
దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.ఆస్ట్రేలియాలో థర్డ్ వేవ్ విజృంభణ రాకుండా నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారిసన్ వెల్లడించారు.
ప్రధాని నిర్ణయంపై భారత్లోని బెంగళూరుకు చెందిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.దీనిపై త్వరలో విచారణ జరగనుంది.
అయితే ఈలోపే మోరిసన్ … ఆంక్షలపై కాస్త సడలింపులు ఇవ్వడం విశేషం.