ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే వాట్సాప్ యాప్ పై ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉంటున్నాయి.ఈ యాప్ భద్రతపై చాలాసార్లు సందేహాలు వచ్చాయి.
మళ్ళీ సర్దుమణిగిపోయాయి.అయితే, ఇప్పుడు మళ్ళీ అటువంటి సందేహమే తలెత్తుతోంది.
వాట్సాప్ యూజర్ల ఖాతాలను ఫోన్ నెంబర్ సహాయంతో రిమోట్ గా హ్యాకర్లు సస్పెండ్ చేసే అవకాశం ఉందని భద్రతా పరిశోధకులు చెబుతున్నారు.అయితే వాట్సాప్ అలాంటిదేమీ జరగదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో వాట్సాప్ పలు ఫీచర్లను తెస్తూ యూజర్లకు అండగా నిలుస్తోంది.ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ తన నూతన ప్రైవసీ పాలసీపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ప్రకటన అనంతరం వాట్సాప్ అనేక విమర్శలను ఎదుర్కొంది.అనేక మంది వినియోగదారులను సైతం దూరం చేసుకుంది.
యూజర్లు తప్పనిసరిగా తమ నూతన ప్రైవసీ పాలసీ నిబంధనలను అంగీకరించాల్సిందేనని వాట్సాప్ తేల్చిచెప్పడంతో వినియోగదారులు యాప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో వాట్సాప్ ను వీడి సిగ్నల్, టెలిగ్రామ్ తదితర ఇతర యాప్ ల్లో ఖాతాలను ప్రారంభించారు అనేక మంది యూజర్లు.
దీంతో ఆ సమయంలో ఎట్టకేలకు వాట్సాప్ వెనక్కు తగ్గింది.తమ నూతన పాలసీ అమలను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
నూతన నిబంధనలు అంగీకరించినంత మాత్రాన యాప్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవని వాట్సాప్ తెలిపింది.వాట్సాప్ పొడిగించిన మూడు నెలల గడువు త్వరలో ముగియనుంది.మే 15 నుంచి వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ అమలులోకి రానుంది.కొత్త పాలసీని అంగీకరించపోతే వాట్సాప్ ఖాతా డిలీట్ చేయబడుతుందని గతంలో సంస్థ తెలిపింది.
వాట్సాప్ తాజాగా ఈ విషయమై కీలక ప్రకటన చేసింది.నూతన నిబంధనలు అంగీకరించకపోతే ఖాతా డిలీట్ కాబడదని స్పష్టం చేసింది.
వాట్సాప్ సేవలను మాత్రం పూర్తిగా వినియోగించుకోలేరని తెలిపింది.వినియోగదారులు కాల్స్, నోటిఫికేషన్లను మాత్రం పొందగలుగుతారు.
కానీ మెసేజ్ లను పంపించడం, చదవడం మాత్రం చేయలేరు.ఈ అవకాశం కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటుంది.
ఈ గడువు ఎప్పటివరకు అన్న విషయమై వాట్సాప్ నుంచి పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది.