భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది.ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా ఇక్కడ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,12,262 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 2,10,77,410కి చేరుకుంది.24 గంటల వ్యవధిలో 3,980 మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు పాజిటివ్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.దీంతో హాస్పిటల్స్లో బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు నిండుకున్నాయి.క్లిష్ట పరిస్ధితుల్లో ప్రపంచానికి అండగా నిలిచిన భారతదేశం ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తోంది.ఇప్పటికే ఇండియాను ఆదుకునేందుకు అమెరికా, ఫ్రాన్స్, యూకే, రష్యా , ఇజ్రాయెల్, కెనడా, సౌదీ అరేబియా తదితర దేశాలు ముందుకొస్తున్నాయి.
ఈ సంగతి పక్కనబెడితే.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులను.ప్రస్తుతం భారత్లో పరిస్ధితులు భయపెడుతున్నాయి.తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఆత్మీయుల క్షేమ సమాచారంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే గతేడాది ఈ మహమ్మారి ఎందరో సన్నిహితులను పక్కనబెట్టుకుంది.లాక్డౌన్, ప్రయాణ ఆంక్షల కారణంగా సంవత్సర కాలంగా పలువురు ఎన్ఆర్ఐలు భారత్లోని తమ స్వస్థలాలకు రాలేకపోయారు.
అలాగే ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లలేకపోయిన వారు కూడా అదే స్థాయిలో వున్నారు.కేసుల సంఖ్య తగ్గి.
పరిస్ధితి కుదుటపడుతుండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.కానీ రోజులు తిరగకుండానే వైరస్ మళ్లీ పంజా విసరడంతో ఆయా దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.
అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశాలు ఇలా ఏ దేశం కూడా మనవారిని రానివ్వడం లేదు.పోనీ ఎమర్జెన్సీ కోటాలో ప్రయాణం పెట్టుకుందామా అంటే దానికి సవాలక్ష అనుమతులు, లాంఛనాలు.
దీంతో ఇండియాలోని రక్తసంబంధీకులు, ఆత్మీయులకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటూనే.తెలిసిన వారిని ఓ కంట కనిపెట్టమని చెబుతున్నారు.
ఈ క్రమంలో అనేక కుటుంబాలు తమ ఆప్తులకు దూరమై తల్లడిల్లుతున్నాయి.కుటుంబానికి ఆధారమైన కొంతమంది ప్రస్తుతం భారత్లోనే చిక్కుకుపోయారు.మరికొంత మంది తల్లులు తమ చిన్నారులకు దూరమయ్యారు.నిరవధికంగా నిషేధం విధించడంతో అది ఎప్పుడు ముగుస్తుందోనని భారత్లో చిక్కుకున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ట్రావెల్ బ్యాన్తో పాటు భారత్లోని కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో ఇక్కడి అమెరికా కాన్సులేట్లు సైతం మూతపడ్డాయి.తన భర్త హెచ్1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నారని.
మా మామగారు చనిపోవడంతో అంత్యక్రియల కోసం ఆయన గత నెల 17న భారత్కు వెళ్లారని ఓ మహిళ చెప్పారు.తన భర్తకు హెచ్1బీ వీసా ఉన్నప్పటికీ, అమెరికాకు తిరిగి రావాలంటే పాస్పోర్ట్పై వీసా స్టాంపింగ్ కావాలని ఆమె వెల్లడించారు.
ఇక తన తొమ్మిది ఏళ్ల బాబు అమెరికాలో ఉన్నాడని, తాను మాత్రం ఇక్కడే చిక్కుకుపోయానని మరో వివాహిత ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా కాన్సులేట్ను మూసివేయడంతో హెచ్1బీ వీసా స్టాంపింగ్ కుదరక తాను భారత్లో ఇరుక్కుపోయానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
వెతికి చూస్తే అమలాపురం నుంచి అమెరికా వరకు ఇదే వ్యథ.వీరంతా తమను ఆదుకోవాని భారత ప్రభుత్వంతో పాటు ఆయా దేశాలకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.