అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్.ట్రంప్ హయాంలో పాతాళానికి పడిపోయిన దేశ ప్రతిష్టను తిరిగి నెలకొల్పుతానని ప్రచారంలో తెలిపారు.
అలాగే అమెరికా అభ్యున్నతికి, అభివృద్ధికి అవరోధాలు సృష్టించేవారి విషయంలో కఠినంగానే వుంటానని, ఇదే సమయంలో మిత్రదేశాలకు బాసటగా నిలుస్తానని హామీ ఇచ్చారు.అన్నట్లుగానే ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు.
తొలుత దేశ పాలనలో తనకు చేదోడువాదోడుగా నిలిచేందుకు నిపుణులను ఏరికోరి నియమించుకున్నారు.కోవిడ్పై పోరాటం చేస్తూనే రాజకీయ వ్యూహాలకు సైతం పదునుపెట్టారు.
ముఖ్యంగా విదేశాంగ విధానంపై బైడెన్ దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలో ఆసియాలో తనకు అత్యంత నమ్మదగిన మిత్రుడిగా వున్న భారత్ విషయంలో ఆయన కాస్తంత పట్టువిడుపుగానే వుంటున్నారు.
కరోనా సంక్షోభ సమయంలో ఇండియాకు సాయం విషయంలో తొలుత మొండిగానే వ్యవహరించిన బైడెన్.అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలతో పాటు భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో మెత్తబడ్డారు.
భారత్కు అవసరమైన సాయం చేస్తామని ప్రధాని మోడీకి తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం.
నాలుగు దఫాల్లో కీలక వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్కు పంపారు.దీనికి అదనంగా అత్యవసర వైద్య సాయంగా 100 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు బైడెన్.
ఈ పరిస్ధితుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసేలా అగ్రరాజ్యాధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు.భారత్లో అమెరికాకు కొత్త రాయబారిని నియమించనున్నారు.
ఇందుకు గాను లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి పేరును బైడెన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికా అధ్యక్షుడికి కుడిభుజంగా అభివర్ణించే ఎరిక్ను భారత్కు పంపడం వెనుక పెద్ద వ్యూహమే వుందంటున్నారు విశ్లేషకులు.డెమొక్రటిక్ పార్టీలో కీలక నేతగా వున్న ఎరిక్ గార్సెట్టి… గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు.ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ మేయర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
అమెరికాలో భారత సంతతి ప్రజలు అధిక సంఖ్యలో స్థిరపడిన నగరాల్లో లాస్ ఏంజిల్స్ ఒకటి.
అమెరికా అధ్యక్షుడిగా జో పగ్గాలను అందుకున్న తరువాత తొలిసారిగా రాయబారి మార్పు చోటు చేసుకోబోతోండటం రెండు దేశాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
ముఖ్యంగా ఇండో-పసిఫిక్ రీజియన్లో ప్రస్తుతం చైనా నుంచి భారత్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.అటు సముద్ర జలాల వ్యవహారంలోనూ డ్రాగన్ దూకుడును ప్రదర్శిస్తోంది.
ఈ విషయంలో భారత్కు అన్ని విధాలుగా అండగా నిలుస్తామంటూ క్వాడ్ దేశాధినేతల సమావేశంలో ఇదివరకే బైడెన్ సంకేతాలను పంపారు.చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే భారత్లో ఎరిక్ లాంటి వ్యక్తి మకాం వేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో బైడెన్ ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎరిక్ నియామకానికి సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం వుంది.