కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు దెబ్బతింటున్నాయి.నిర్మాణం, రిటైల్, రవాణా, వాణిజ్యం, టూరిజం ఇలా అన్నిటి పరిస్ధితి దారుణంగా వుంది.
వాటితో పాటు అత్యంత కీలకమైన విద్యా రంగం కూడా ఈ పెను సంక్షోభం ధాటికి విలవిలలాడుతోంది.ఇప్పటికే అన్ని దేశాల్లోనూ కీలక పరీక్షలు వాయిదా పడగా, ఈ ఏడాదైనా అడ్మిషన్లు వుంటాయా లేదా అన్న ప్రశ్నలు ఎంతోమందిని వేధిస్తున్నాయి.
ఆర్ధిక వ్యవస్థలో విద్యా రంగం కూడా భాగమే.ఇక్కడ చదువు ఒక్కటే ప్రామాణికంగా తీసుకోకూడదు.
దీనిని ఆధారంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న కొన్ని ఇతర రంగాలు కూడా ఆదాయాన్ని పొందుతున్నాయి.
కోవిడ్ కారణంగా దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో వున్న విద్యార్ధుల్ని ఇప్పటికే ఇంటికి పంపించేశారు.
ఎన్నో కోర్సులు ఆన్లైన్ కిందకి వచ్చేశాయి.లాక్డౌన్లు, ఆంక్షలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో క్యాంపస్లో విద్యార్ధుల కళ అన్నదే లేకుండా పోతుంది.
ఇక ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పిన్స్, చైనా వంటి దేశాల్లో భారతీయ విద్యార్ధులు పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారు.
వీరి వల్ల ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు సమకూరుతోంది.అయితే కోవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో మన విద్యార్ధులు అక్కడి నుంచి స్వదేశానికి వచ్చేశారు.
ప్రస్తుతం అమెరికా తదితర దేశాల్లో వైరస్ కాస్త నెమ్మదించింది.దీంతో అక్కడికి వెళ్లేందుకు తిరిగి ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ విద్యార్ధుల ఆశలపై నీళ్లు చల్లింది.
అన్ని దేశాలు ఇండియా నుంచి వచ్చే విమానాలు, ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి.ఇందులో అమెరికా కూడా వుంది.
మే 4 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని.అలాగే ఇండియాలో వున్న అమెరికన్లు వీలైనంత త్వరగా అక్కడి నుంచి వచ్చేయాలని ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.దీంతో విద్యార్ధుల పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది.అయితే విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారికి మినహాయింపునిచ్చింది అమెరికా.అగ్రరాజ్యంలో అడ్మిషన్ పొందిన కాలేజ్ లేదా యూనివర్సిటీలో ఆగస్టు 1వ తేదీ, తర్వాత క్లాసులు ప్రారంభమవుతున్నట్లయితే అలాంటి భారతీయ విద్యార్ధులు తమ దేశంలోకి రావొచ్చని తెలిపింది.ఎఫ్-1, ఎం-1 వీసాలున్న విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.భారత్లోని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్నుగానీ సంప్రదించాల్సిన అవసరం లేకుండా వీరు అమెరికాకు రావొచ్చు.ఇదే సమయంలో ఆగస్టు 1 కంటే ముందు క్లాసులు ప్రారంభమయ్యే వారు మాత్రం అమెరికాలోని సంబంధిత విద్యాసంస్థలను సంప్రదించాల్సి వుంటుంది.