2024లో గెలుపు అవకాశాలు తమకు అనుకూలంగా ఉండేలా ఏపీ సీఎం జగన్ ఇప్పటి నుంచే తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.అప్పటిలోగా ప్రధాన ప్రతిపక్షంతో పాటు, మిగిలిన రాజకీయ ప్రత్యర్థులను పూర్తిగా బలహీనం చేసి, వారెవరికీ అవకాశం దక్కకుండా చేయాలనేది జగన్ ప్లాన్ అందుకే అన్ని విషయాల్లోనూ క్లారిటీగా ఉంటూ, ఇప్పటి నుంచే మరోసారి గెలుపు బాట పట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
దీనిలో భాగంగానే మాజీమంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
అంతేకాదు ఆయన ను పార్టీలో చేర్చుకుని రాజ్యసభకు పంపాలని జగన్ వ్యూహం రచిస్తున్నారు.
కాపు ఉద్యమ నాయకుడిగా, వారికి రిజర్వేషన్ సంపాదించేందుకు ఎంతగానో పోరాటం చేసినా, ముద్రగడ పై ఆ సామాజిక వర్గం లో అనుకూలత, సానుభూతి రెండు ఉన్నాయి.అందుకే ఆయనను చేర్చుకుని కీలకమైన రాజ్యసభ సభ్యత్వం ఇస్తే వైసిపికి మేలు జరుగుతుందని , రాబోయే రోజుల్లో వైసీపీ ని టార్గెట్ చేసుకుంటున్న జనసేన, టిడిపి, బీజేపీలకు చెక్ పెట్టినట్లు అవుతుందనేది జగన్ అభిప్రాయంగా ఉందట.
ఇప్పటికే ముద్రగడ ను చేర్చుకునేందుకు బీజేపీ ఎంతగానో ప్రయత్నించింది.
ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముద్రగడ ఇంటికి వెళ్లి మరి ఆయనకు తమ పార్టీలో ప్రాధాన్యత గురించి చర్చించారు. అయినా బీజేపీలోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు.కానీ జగన్ విషయంలో ముద్రగడ మొదటి నుంచి సానుకూలంగా ఉండటం వంటి కారణాలతో ఆయన తప్పకుండా వైసీపీలోకి వస్తారు అనే ఆశ జగన్ పెట్టుకున్నారు.
అందుకే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో పాటు , పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని జగన్ రాయబారం సైతం పంపుతున్నారట.త్వరలోనే ఆయన వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది .కాకపోతే ఇంత అకస్మాత్తుగా ఈ ప్రతిపాదన జగన్ చేయడానికి కారణం రాబోయే రోజుల్లో జనసేన, బీజేపీ ,టీడీపీలు కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకోవడం తో ఆ సామాజిక వర్గం ఓట్లు తమకు దూరం కాకుండా జగన్ ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారట.ప్రస్తుతం వైసీపీలో ఉన్న కాపు సామాజికవర్గం నేతలు రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపించలేరు కాబట్టి, ముద్రగడ ను పార్టీ లోకి తీసుకోవడం ఒక్కటే మార్గం గా జగన్ భావిస్తున్నారట.
ముద్రగడ ను చేర్చుకోవడం ద్వారా ప్రధానంగా జనసేన దూకుడుకు కళ్లెం వేయడం తో పాటు, కాపు సామాజిక వర్గం లో ఓట్లలో చీలిక తేవాలి అనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో జనసేన ప్రభావం పెద్దగా లేకుండా చేసేందుకు, ముద్రగడ అండ కోసం జగన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.